Begin typing your search above and press return to search.

మీ 'డీఎన్ ఏ' ఆధారంగా డైట్: ఇక మ‌న ఆరోగ్యం మన చేతిల్లో!

By:  Tupaki Desk   |   12 Aug 2019 1:45 PM GMT
మీ డీఎన్ ఏ ఆధారంగా డైట్: ఇక మ‌న ఆరోగ్యం మన చేతిల్లో!
X
ఈ ఆధునిక మానవ జీవనంలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే డైట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. రోజూ ఎలాంటి ఆహారం తినాలి? ఈ గంటలో ఏం తినాలి? ప్రతిరోజూ ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏ ఆహార పదార్ధాల్లో ఏ విటమిన్లు ఉంటాయి? మాంసాహారం ఎంతవరకు తీసుకోవచ్చు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే డైట్ నియమాల్లో ఉంటాయి. అలాగే ఈ డైట్లకి సంబంధించి ఇంటర్నెట్ లో బోలెడు విషయాలు కూడా ఉంటాయి.

అయితే ఒకో డైట్‌ లో ఒకోలా ఉంటుంది. దీంతో అయోమయానికి గురై ఏది సరిగా ఫాలో అవ్వాలో తెలియక ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఏం లేకుండా. మన డిఎన్ ఏ ఆధారంగా మన డైట్ రూపొందించవచ్చు. మన డీఎన్ ఏను విశ్లేషించి జన్యుపరంగా సంక్రమించే జబ్బులేవో అంచనా వేసి, ఆ జబ్బులు రాకుండా నివారించ గలిగిన ఆహారం తీసుకోవాలి. దీన్నే ‘పర్సనల్‌ న్యూట్రిషన్‌ డైట్‌’ అంటారు.

ఇప్పటికే ఈ పద్దతి నార్వేలో కొనసాగుతుంది. మన డిఎన్ ఏని పరీక్షించి దాని ఆధారంగా డైట్ రూపొందిస్తారు. అయితే దీన్ని మనం కూడా తెలుసుకోవాలని అనుకుంటే నార్వేకు గానీ - భారత్‌ లోని డీఎన్ ఏ సెంటర్లకు గానీ మన లాలాజలం తీసి పంపించాలి. వారు మన డీఎన్ఏ జన్యుక్రమాన్ని విశ్లేషించి నివేదిక పంపిస్తారు. అలాగే వచ్చే అవకాశం ఉన్న జబ్బులు గురించి కూడా విశ్లేషిస్తారు. దాని బట్టి ఎలాంటి ఆహారం కూడా తీసుకోవాలో వివరిస్తారు.

ఇక ఆ డైట్ ని ఫాలో అయితే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇదిలా ఉంటే మనిషి శరీరంలో దాదాపు ఐదు లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని ‘పర్సనలైజ్డ్‌ న్యూట్రిషన్‌’ పరీక్షల్లో తేలింది. దీని వల్ల‌ మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ భాగం ఆ బ్యాక్టీరియాలకే పోతుంది అంట. అందుకే ఈ కొత్త డైట్‌ విధానం అవసరం అని డాక్టర్లు తేల్చారు. అయితే మనం సరైన డైటింగ్‌ చేసి ఆహార పదార్ధాలని తీసుకుంటే దాని ద్వారా కొన్ని రకాల బ్యాక్టీరియాలను చంపేయవచ్చట.

ఇక దీనికి ప్రత్యేకంగా మెడిసిన్ వాడక్కర్లేదు అనమాట. కాగా, ప్రతి మనిషి ఆరోగ్యం గురించి బ్రిటన్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. హాస్పటల్ కి వచ్చే ప్రతి రోగి డీఎన్ఏను తప్పనిసరిగా తీసుకుని, దాన్ని విశ్లేషించి ఆ డేటాను నిక్షిప్తం చేయాల్సిందిగా ‘జాతీయ ఆరోగ్య సేవల ప్రాజెక్ట్‌ ’ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యం రక్షించుకోవచ్చని బ్రిటన్ ప్రభుత్వ ఆలోచన.