Begin typing your search above and press return to search.

రైతులకు టైమిచ్చిన హైపర్ కమిటీ.. ఎంతవరకంటే?

By:  Tupaki Desk   |   13 Jan 2020 10:29 AM GMT
రైతులకు టైమిచ్చిన హైపర్ కమిటీ.. ఎంతవరకంటే?
X
ఏపీలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న మూడు రాజధానులకు సంబంధించిన అంశాల్ని చర్చించేందుకు హైపర్ కమిటీ ఈ రోజు సమావేశమైంది. హైపర్ కమిటీ సభ్యులు హాజరు కావటమే కాదు.. పలు అంశాల మీద చర్చలు జరిపారు. ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించి మంత్రి పేర్ని నాని పలు అంశాల్ని వెల్లడించారు.

తమ కమిటీ ఈ నెల 17న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాదు.. రాజధాని రైతులు ఏమైనా సలహాలు.. సూచనలు చేయాలనుకుంటే చేయొచ్చని.. ఫిర్యాదు చేసేందుకు సైతం వారికి గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాజధాని రైతులు ఏం చెప్పాలనుకున్నా.. ఈ నెల 17లోపు సీఆర్డీఏ కమిషనర్ కు లేఖ రాయాలని చెప్పారు.

లేఖల రూపంలోనూ.. ఈ మొయిల్ రూపంలోనూ చెప్పొచ్చన్నారు. తమకున్న సందేహాల్ని తీర్చుకునేందుకు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. ఆందోళనలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని.. ఇందుకోసం బయట ప్రాంతాలకు చెందిన మహిళల్ని తీసుకొస్తున్నట్లు ఆరోపించారు.

సానుభూతి కోసం పక్కా ప్లాన్ లో భాగంగా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేందుకు వీలుగా ధర్నాలు ప్లాన్ చేస్తున్నారని.. వీటన్నింటి వెనుకా తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. రాజధానికి సంబంధించి అసలేం జరుగుతుందన్న అంశం మీద రైతులకు ఒక స్పష్టత ఉందన్న పేర్ని నాని.. 29 గ్రామాల్లో వారికి నిజమైన రైతాంగానికి ఇప్పటికే అర్థమైందన్నారు.

పోలీసుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని పద్దతి ప్రకారం చేస్తున్నారన్న పేర్ని నాని.. రాజకీయ సానుభూతి కోసం.. మైలేజీ కోసం ప్రతిపక్షం ప్రయత్నిస్తుందన్నారు. రైతుల సమస్యల మీద తాము నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నామని.. తాము రైతుల్ని వ్యక్తిగతం గానూ కలుస్తున్నట్లు చెప్పారు. మరి.. మంత్రి పేర్ని నాని పేర్కొన్నట్లు ఎంతమంది రైతులు తమ సలహాలు.. సూచనలు.. ఫిర్యాదులు చేస్తారో చూడాలి.