Begin typing your search above and press return to search.

హైదారబాదీయులు.. చెత్త వేసేందుకు వెళుతున్నారా? జర జాగ్రత్త

By:  Tupaki Desk   |   15 March 2021 1:37 AM GMT
హైదారబాదీయులు.. చెత్త వేసేందుకు వెళుతున్నారా? జర జాగ్రత్త
X
ఇంట్లో చెత్త లేకుంటే చాలు. బయట ఎలా ఉన్నాఫర్లేదన్న ధోరణి చాలామందిలో కనిపిస్తుంది. అందుకే.. ఇంట్లో ఉన్న చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేసేటోళ్లు భారీగా కనిపిస్తారు. ఇలాంటి వారి విషయంలో జీహెచ్ఎంసీ వినూత్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి సర్కిల్ లోని కొండాపూర్ డివిజన్ లో సరికొత్త విధానాన్ని అమలు చేశారు. ఇంట్లోని చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారేసేందుకు వచ్చిన వారిని శానిటరీ సిబ్బంది విధించిన అనూహ్య శిక్షకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

మళ్లీ.. అలాంటి తప్పు చేయకూడదన్నట్లుగా వారి తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ వారేం చేశారంటే.. చెత్తను పారబోసేందుకు వచ్చిన వారిని పట్టుకున్న జీహెచ్ఎంసీ శానిటరీ సిబ్బంది.. వారిని ఆ చెత్త పక్కనే గంటసేపు నిలుచోబెట్టారు. స్వచ్ఛత కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకపోవటంతో ఈ వినూత్న చర్యకు తెర తీశారు.

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఇష్టారాజ్యంగా పడేయటం కారణంగా.. దుర్వాసన వెదజల్లటంతో పాటు.. చుట్టుపక్కల వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. చెత్త కారణంగా ఎలాంటి ఇబ్బంది పడతారో తెలిపేలా.. జీహెచ్ఎంసీ తాజా శిక్ష విధించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారబోయటం మానుకోవాలని.. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన చెత్త తరలింపు ఆటోల్లో మాత్రం వేయాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే తరహా శిక్ష విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.