Begin typing your search above and press return to search.

నార్త్ కాలిఫోర్నియాలో యాదాద్రి జిల్లా కుర్రాడి మృతి

By:  Tupaki Desk   |   7 April 2019 4:50 PM GMT
నార్త్ కాలిఫోర్నియాలో యాదాద్రి జిల్లా కుర్రాడి మృతి
X
తెలంగాణ యువకుడు అమెరికాలో అనుమానాస్పద మృతి చెందాడు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని నల్లపోచమ్మ వాడ కాశీ విశ్వనాథ్(26) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. మూడున్నరేళ్ల క్రితం ఉద్యోగ రిత్యా విశ్వనాథ్ అమెరికా వెళ్లాడు. అక్కడ ఇన్ఫోసిస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఆయన తన గదిలో శవమై కనిపించాడు.

ఉదయం 10 గంటల వరకు విశ్వనాథ్‌ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు గది తలుపులు పగలగొట్టి లొపలికి వెళ్లారు. అక్కడ విశ్వనాథ్‌ అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులకు సమచారమిచ్చారు. అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే విశ్వనాథ్‌ మరణించాడు.

కాగా ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, గతంలో తనకేమైన ఆరోగ్య సమస్యలున్నాయా? అని కాశీవిశ్వనాథ్‌ పెద్దనాన్న కుమారుడు ధన్‌శ్యాం నాథ్‌ను వైద్యులు అడిగారు. కాశీ విశ్వనాథ్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతడి పెద్దనాన్న ఎన్‌.అశోక్‌ చెప్పారు. విశ్వనాథ్‌ మృతిపై తమకు అనుమానాలున్నాయన్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపిస్తామని ఇన్ఫోసిస్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారన్నారు.

26 ఏళ్ల యువకుడు ఏ కారణం లేకుండా చనిపోవడంపై సందేహాలు వ్యక్తమవతున్నాయి. ఫోరెన్సిక్ పరీక్షలు, పోలీసు విచారణ తరువాత వాస్తవాలు వెల్లడికానున్నాయి. ఆయనది సహజ మరణమా.. లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది.