Begin typing your search above and press return to search.

రియ‌ల్ట‌ర్ల ఫ‌స్ట్ ప్ర‌యారిటీ హైద‌రాబాదేన‌ట‌!

By:  Tupaki Desk   |   17 Jun 2017 2:27 PM IST
రియ‌ల్ట‌ర్ల ఫ‌స్ట్ ప్ర‌యారిటీ హైద‌రాబాదేన‌ట‌!
X
రియ‌ల్టీ రంగానికి సంబంధించిన పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించే న‌గ‌రాల్లో భాగ్య న‌గ‌రి హైద‌రాబాద్ అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇప్ప‌టికే ప‌లు అంశాల‌కు సంబంధించి ఇత‌ర న‌గ‌రాల‌తో పోటీ ప‌డుతున్న భాగ్య న‌గ‌రి ఎన్నో అంశాల్లో త‌న‌దైన మార్కు స‌త్తా చాటింది. తాజాగా రియ‌ల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్ర‌ముఖ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్న న‌గ‌రాల జాబితాలో భాగ్య న‌గ‌రి టాప్ పొజిష‌న్‌ లో నిలిచింది. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ కు సంబంధించి ఈ అంశంలో న‌గ‌రం అగ్ర స్థానంలో నిలిచిన‌ట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ కుష్‌ మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ ‘బెట్టింగ్‌ ఆన్‌ ఆసియా పసిఫిక్‌ నెక్ట్స్‌ కోర్‌ సిటీస్‌’ నివేదిక తెలిపింది. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా వివ‌రించిన ఆ సంస్థ‌... నగరంలో వాణిజ్య - కార్యాలయాల విభాగాల అభివృద్దే ఇందుకు కారణమని పేర్కొంది.

ఏపీఏసీ నగరాల జాబితాలో బ్యాంకాక్ - మనీలా - గ్యాంగ్‌ జూ వంటి న‌గ‌రాల‌తో పాటు దేశంలోని ఢిల్లీ - ముంబై వంటి న‌గ‌రాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఈ న‌గ‌రాల‌న్నింటినీ వెన‌క్కు నెట్టేసిన భాగ్య‌న‌గ‌రి తొలి స్థానాన్ని ద‌క్కించుకుని స‌త్తా చాటింది. ప్ర‌పంచ దేశాల‌న్నీ నెత్తిన పెట్టుకునే బ్యాంకాక్ ఈ జాబితాలో హైద‌రాబాదు త‌ర్వాతి స్థానంలో నిలిచి రెండో స్థానంతోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా ఖ్యాతిగాంచిన బెంగ‌ళూరు 6వ స్థానంలో నిల‌వ‌గా, ఎక‌న‌మిక్ కేపిట‌ల్‌ గా విరాజిల్లుతున్న ముంబై 7వ స్థానంతో స‌రిపెట్టుకుంది. పుణె - చెన్నై - ఢిల్లీ నగరాలైతే వరుసగా 8 - 9 - 10వ స్థానాలకు పరిమితమయ్యాయి. మూడో స్థానంలో మనీలా నిలవగా.. చైనాకు చెందిన గ్యాంగ్‌ జూ - శెన్‌ జైన్‌ నగరాలు వరుసగా 4 - 5వ స్థానాల్లో నిలిచాయి.

ఒక్కసారిగా దేశీయ స్థిరాస్తి రంగం ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ (ఏపీఏసీ)లో గుర్తింపు రావటానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనని నిపుణులు చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌), రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ బిల్లు (రెరా) - వస్తు సేవల పన్ను (జీఎస్‌ టీ) - బినామీ ట్రాన్సాక్షన్‌ చట్టం వంటివి స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొచ్చిందని.. దీంతో జాతీయ - అంతర్జాతీయ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయని కుష్‌ మన్‌ వేక్‌ ఫీల్డ్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సిద్దార్థ్‌ గోయల్‌ తెలిపారు.

ఏపీఏసీలో కేవలం ఇండియాలో మాత్రమే కార్యాలయాల సముదాయాలకు డిమాండ్‌ గణనీయంగా వృద్ధి చెందుతోంది. గత మూడేళ్లుగా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 32–35 మిలియన్‌ చ.అ. వాణిజ్య స్థలాలు లీజు - కొనుగోలు లావాదేవీలు జరిగాయి. ఇందులో ఐటీ - బీపీఎం రంగాల వాటా 52–55 శాతం. గతేడాది ఈ రంగాల వాటా 65–70 శాతం. ముంబై - ఢిల్లీ–ఎన్‌ సీఆర్ - బెంగళూరు నగరాలతో పాటూ ద్వితీయ శ్రేణి మార్కెట్లయిన చెన్నై - హైదరాబాద్ - పుణెల్లోనూ పారిశ్రామిక - ఈ–కామర్స్ - గిడ్డంగుల మార్కెట్‌ అభివృద్ధి చెందుతోంది. ఏపీఏసీలోనే పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్‌ తొలిస్థానంలో నిలవటమే ఇందుకు ఉదాహరణ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/