Begin typing your search above and press return to search.

హుజూరాబాద్, బద్వేల్ బైపోల్ : నామినేషన్ల పరిశీలన పూర్తి.. బరిలో మొత్తం ఎంతమందంటే ?

By:  Tupaki Desk   |   11 Oct 2021 3:15 PM GMT
హుజూరాబాద్, బద్వేల్ బైపోల్ : నామినేషన్ల పరిశీలన పూర్తి.. బరిలో మొత్తం ఎంతమందంటే ?
X
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నిక సమరం నడుస్తోంది. ఉపఎన్నికకు సంబంధించి కీలకమైన నామినేషన్ల పరిశీలన పర్వం ముగిసింది. రెండు నియోజకవర్గాల్లోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. హుజూరాబాద్‌ లో ఏకంగా మొత్తం 61మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన నిన్న 46మంది తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. వీరంతా బరిలో ఉంటే ఈవీఎంలు పెరగనున్నాయి.

బద్వేల్‌ లోనూ నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. స్క్రూటినీ తర్వాత18 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. తెలంగాణలోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రాజేందర్‌ పేరుతో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరఫున బరిలో ఈటల రాజేందర్‌ బరిలో ఉండగా చివరి రోజున రాజేందర్‌ పేరుతో మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరందరి ఇంటి పేరు కూడా ఈ అనే అక్షరంతోనే ప్రారంభమైంది. ఇమ్మడి రాజేందర్‌, ఈసంపల్లి రాజేందర్‌, ఇప్పలపల్లి రాజేందర్‌ తమ నామినేషన్లు దాఖలు వేశారు.

అయితే, ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకే టీఆర్‌ఎస్‌ ఇలాంటి నామినేషన్స్‌ వేయించిందని ఆరోపిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇక, గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది హుజూరాబాద్‌ బైపోల్‌ ఫైట్‌లో ఉండగా, 43మంది ఇండిపెండెంట్లతో పాటు మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్స్‌ వేశారు. దీంతో సోమవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 43 మంది బరిలో నిలిచారు. 18 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఈనెల 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈలోగా ఇండిపెండెంట్‌ అభ్యర్థులను బుజ్జగించి, నామినేషన్లను ఉపసంహరింప జేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రధాన పార్టీలు.

13 తర్వాత పోటీలో ఎంత మంది ఉంటారన్న దానిపై పూర్తి క్లారిటీ రానుంది. మరోవైపు, ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఇప్పటికే ఆమోదం పొందాయి. టీఆర్ ఎస్ నుంచి గెల్లు శ్రీనినాస్, బీజేపీ నుంచి ఈటల, కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. బద్వేల్‌ నియోజకవర్గం లోనూ నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత 18 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 9 నామినేషన్లను తిరిస్కరించారు. ఈ ఉపఎన్నికలో మొత్తం 27 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు సమర్పించారు. వైసీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధ, బీజేపీ నుంచి సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ చేస్తున్నారు. కాగా, ఈ నెల 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఉండటంతో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తోంది.