Begin typing your search above and press return to search.

ప‌రువు పోయింద‌నే ఇలా చేస్తున్నారా మోడీజీ

By:  Tupaki Desk   |   7 Sep 2017 6:08 AM GMT
ప‌రువు పోయింద‌నే ఇలా చేస్తున్నారా మోడీజీ
X
పెద్దనోట్ల రద్దు... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఏలుబ‌డిలో తీసుకున్న అత్యంత సంచ‌ల‌న‌మైన‌, విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం. దేశ ఆర్థిక స్థితిని మార్చేస్తుంద‌ని మోడీజీ భావించిన ఈ సంస్క‌ర‌ణ ఆయ‌న సర్కారుకు మేలు త‌క్కువ చేయ‌గా ఆగ్ర‌హానికి ఎక్కువ కేంద్రంగా మారింది. ఈ నేప‌థ్యంలో పెద్ద నోట్ల ర‌ద్దుతో అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోయిందన్న విమర్శల నుంచి తప్పించుకొనేందుకు కేంద్రం దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇందులో భాగంగా పెద్దనోట్ల రద్దు సమయంలో ఆయా బ్యాంకుల్లో వివిధ రూపాల్లో డిపాజిటైన నల్లధనం వివరాలను వెలికి తీయాలని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులకు ఆదేశాలిచ్చినట్టు సమాచారం.

పన్ను పరిధిలో చూపకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదు డిపాజిట్ల నిగ్గు తేల్చాలని సర్కారు నిర్ణయించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి స్వయంగా ప్రధాన మంత్రి కార్యాలయమే (పీఎంవో) నేరుగా ఆదాయపు పన్ను శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం విశేషం. రద్దు చేసిన కరెన్సీలో దాదాపు 99 శాతం పెద్దనోట్లు తిరిగి తమ గూటికే చేరినట్టుగా ఆర్‌బీఐ వెల్లడించిన కొద్ది రోజులకే పీఎంవో ఈ ఆదేశాలను జారీ చేసినట్టుగా ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల రెవెన్యూ శాఖ - ప్రత్యక్ష పన్నుల బోర్డు - సీబీఈసీ శాఖ అధికారులతో ప్రధాని రహస్యంగా నిర్వహించిన సమావేశంలో ప్రధాని నల్లధనం వేటపై ఉన్నతాధికారులకు స్పష్టమైన కార్యాచరణను వెల్లడించినట్టుగా సమాచారం. ప్రధాన మంత్రి సూచనల అనుసారం అనుమానాస్పద, అనూహ్య డిపాజిట్ల నిగ్గు తేల్చేందుకు గాను ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమకు అందుబాటులో ఉన్న ఆయుధాలకు పదును పెట్టతున్నట్టుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా గత కొన్ని సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్స్న్‌ ఆధారంగా రద్దు సమయంలో డిపాజిట్ల మొత్తాన్ని పోల్చి చూడనున్నారు. దీనికి తోడు అనూహ్యంగా డిపాజిట్‌ చేసిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని కూడా యజమానిని అడిగి తెలుసుకొని చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది. నోట్ల రద్దు సమయంలో జన్‌ధన్‌ ఖాతాల్లో అనూహ్యంగా డిపాజిట్‌ అయిన దాదాపు రూ.65,000 కోట్ల సొమ్ము విషయాన్ని కూడా ఐటీ అధికారులు ఇక విచారించనున్నారు. దీనికి తోడు ఐటీ రిటర్నులు దాఖలు చేయకుండా కొత్తగా అందుబాటులోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానంలోకి నమోదు అయిన వారి వివరాలను కూడా సేకరించి చర్యలు చేపట్టాలని ప్రధాని కార్యాలయం నుంచి ఐటీ శాఖకు దేశాలు అందినట్టుగా సమాచారం. తాజా పరిణామంతో అక్రమార్కుల్లో కొత్త గుబులు మొదలైందని అంటున్నారు.