Begin typing your search above and press return to search.

వేతన జీవులకు షాక్.. ఈసారి పెంపు అరకొరేనట

By:  Tupaki Desk   |   19 Feb 2020 2:54 PM IST
వేతన జీవులకు షాక్.. ఈసారి పెంపు అరకొరేనట
X
కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్త ఆలోచనలు..కొత్త ప్రణాళికలు ఎవరికి వారు వేసుకుంటారు. ఏ స్థాయిలో ఉండే వారు తమ స్థాయికి తగ్గట్లు తాము చేసే పనికి సంబంధించి జీతాల పెంపు మీద కోటి కలలు కంటుంటారు. ఇక.. పారిశ్రామకరంగంలోనూ.. ఐటీ కంపెనీల్లో పని చేసే వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సంవత్సరం వచ్చిన నెలకే.. తమకు పెరగబోయే జీతాల మీద చాలానే కలలు కంటుంటారు. నూటికి అరవై.. డెబ్భై శాతం మంది తమకు వార్షికంగా పెరిగే జీతాలకు సంబంధించిన లెక్కలు వేసుకొని.. అందుకు తగ్గట్లు ఏమేం చేయాలన్న ప్లాన్ సెట్ చేసుకునేటోళ్లు చాలామందే కనిపిస్తారు.

ఇలాంటి వేతన జీవులందరికి షాకింగ్ న్యూస్ గా చెప్పాలి. ఈ ఏడాది జీతాల పెంపు ఆశించినంత స్థాయిలో ఉండదని తేల్చి చెబుతున్నారు. ఆర్థిక మందగమనం.. చైనా కొవిడా వైరస్ ప్రభావం తో పాటు.. ఇతరత్రా కారణాలతో జీతాల పెంపు ఎక్కువగా ఉండదని.. గత ఏడాది డబుల్ డిజిట్ లో పెంపు ఉంటే ఈసారి సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుందన్న మాట వినిపిస్తోంది.

దీనికి తగ్గట్లే తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ సేవల సంస్థ ఏఓన్ పీఎల్ సీ వార్షిక వేతన పెంపు ఎంత ఉంటుందనే అంశంపై తాను చేపట్టిన సర్వేను వెల్లడించింది. దీని ప్రకారం 2018.. 2019లో కంపెనీలు 9.5.. 9.3 శాతం మేర వేతనాలు పెంచాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈసారి చాలా తక్కువగా జీతాల పెంపు ఉండనుందని పేర్కొంది.

తామీ మాటలు ఉత్తనే చెప్పటం లేదని.. 20రంగాలకు చెందిన వెయ్యి కంపెనీలను తమ సర్వేకు సంబంధించిన వివరాలు సేకరించి.. మదింపు చేసిన తర్వాతే ఈ చేదువార్త చెబుతున్నట్లుగా పేర్కొంది. ఈ తరహా సర్వేలను సాకుగా చూపించి జీతం పెంపులో కోత విధించినా ఆశ్చర్యం లేదేమో? మొత్తంగా 2020 వేతన జీవులకు నిరాశను మిగులుస్తుందనటంలో సందేహం లేదంటున్నారు.