Begin typing your search above and press return to search.

హెలికాప్టర్లకు భలే గిరాకీ

By:  Tupaki Desk   |   7 April 2019 2:30 PM GMT
హెలికాప్టర్లకు భలే గిరాకీ
X
లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. ఒకేరోజులో నాలుగైదు జిల్లాల్లో బహిరంగ సభలకు హాజరవుతున్నారు. రోడ్డు మార్గం గుండా ఆలస్యం అవుతుందనే క్రమంలో హెలికాప్టర్‌ లలో పయనిస్తున్నారు. ఫలితంగా హెలికాప్టర్లకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగిపోయింది. వచ్చే మే 10వ తేదీ వరకు చాలా హెలికాప్టర్లను ఇప్పటికే రాజకీయ నేతలు రిజర్వు చేసుకున్నట్లు సమాచారం. సాధారణ రోజుల్లో అయితే గంటకు రూ. 60 వేలు నుంచి రూ. 80 వేల వరకు అద్దెను ఆయా హెలికాప్టర్‌ కంపెనీలు వసూలు చేస్తాయి. అయితే ఎన్నికల కారణంతో ప్రస్తుతం ఆ ధర రూ. లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. జీఎస్టీతో కలిపి మొత్తం రూ. 1.50 లక్షలకు చేరుకుంది. ఈమేరకు ఆయా కంపెనీలు రాజకీయ నేతల నుంచి వసూలు చేస్తున్నాయి. డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు గంటకు అయితే హెలికాప్టర్లను అద్దెకు ఇవ్వడం లేదు. కనీసం రెండు గంటలు బుక్‌ చేసుకునే వారికే హెలికాప్టర్లను అందజేస్తున్నాయి. ఫలితంగా అవసరం ఉన్నా.. లేకున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో రెండు గంటల పాటు నేతలు హెలికాప్టర్లను బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అన్ని రాష్ట్రాల్లోనూ..
జాతీయ నేతలు అయితే రాజధాని ఢిల్లీ నుంచి ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక విమానాల్లో వచ్చి రోడ్డు గుండా సమావేశ స్థలికి చేరుకుంటారు. కాగా స్థానిక నేతలు ఆయా రాష్ట్రాల రాజధాని నుంచి పలు జిల్లాలకు హెలికాప్టర్లలో వస్తున్నారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రముఖ పార్టీల అధినేతలు అందరు హెలికాప్టర్‌లోనే చక్కర్లు కొడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ తదితరులు రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలో సీఎం కుమారస్వామి, మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ ప్రధాని హెచ్‌ దేవెగౌడ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యురప్ప తదితర హేమాహేమీలు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలంటే హెలికాప్టర్లు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి.

ల్యాండింగ్‌ కు అదనపు ఫీజు
హెలికాప్టర్‌ లను అద్దెకు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా ల్యాండింగ్‌ కోసం అదనపు ఫీజును వసూలు చేస్తున్నారు. సుమారు మే 10వ తేదీ వరకు అన్ని హెలికాప్టర్లు బుక్‌ అయ్యాయి. హెలికాప్టర్లు కావాలంటే ఆ తర్వాతనే ప్రయత్నించాలని ఆయా కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే అనధికారికంగా ప్రకటించారు. ల్యాండింగ్‌ వ్యవస్థ కోసం రూ. 30 వేల ఖర్చు అవుతుంది. పైలట్‌ వెయిటింగ్‌ చార్జీలు కూడా సంబంధిత పార్టీలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెలికాప్టర్లు కావాల్సిన రాజకీయ పార్టీలు, కంపెనీలు జీఎస్టీ వివరాలతో కలిపి మెయిల్‌ ద్వారా వివరాలు పంపిస్తే అద్దె, ఇతరత్రా ఫీజుల వివరాలను తెలియజేస్తారు. అంతా ఓకే అనుకున్నాకే హెలికాప్టర్లను అద్దెకు ఇస్తున్నారు. కాగా దక్షిణాది రాష్ట్రాల్లో హెలికాప్టర్లకు డిమాండ్‌ అధికం కావడంతో ఉత్తరాది నుంచి తెప్పిస్తున్నారు. ప్రచారం కోసం హెలికాప్టర్లను ఉపయోగించే నేతలు, పార్టీలు ఆ ఖర్చును తమ ఎన్నికల ఖర్చులో పొందుపరచాలి. హెలికాప్టర్ల అద్దె ఫీజులు కూడా ఎన్నికల ఖర్చులోకి వస్తాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆ ఖర్చులకు సంబంధించిన వివరాలను కచ్చితంగా సమర్పించాలని సూచించారు.