Begin typing your search above and press return to search.

పరీక్షించ‌కుండా స్టెరాయిడ్స్ ఎలా ఇస్తారు ... ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్ !

By:  Tupaki Desk   |   18 May 2021 12:30 PM GMT
పరీక్షించ‌కుండా స్టెరాయిడ్స్ ఎలా ఇస్తారు ...  ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్ !
X
క‌రోనా వైరస్ విజృంభణ సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వ‌హిస్తోన్న సీటీ స్కాన్‌, ర‌క్త ప‌రీక్ష‌ల ధ‌రల వివ‌రాల‌ను తెల‌పాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ క్ర‌మంలో 48 గంట‌ల్లో పూర్తి వివ‌రాలు అందించాల‌ని గ‌డువు విధించింది. ఇక సీటీ స్కాన్, ఇత‌ర ప‌రీక్ష‌ల‌కు గ‌రిష్ట ధ‌ర‌ను నిర్ణ‌యించ‌కుండా, వీటిని మిన‌హాయిస్తూ గ‌త ఏడాది జీవో ఇవ్వడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. క‌రోనా స‌మ‌యంలో కీల‌కంగా మారిన సీటీ స్కాన్‌, ఇత‌ర ర‌క్త ప‌రీక్ష‌ల ధ‌ర‌ల‌తో పాటు పీపీఈ కిట్స్‌ కు, వైద్య చికిత్సలకు ధరలను నిర్ణయించి తాజాగా జీవో జారీ చేయాలని ,ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌రలు.. రోగులు, వారి స‌హాయ‌కుల‌కు తెలిసేలా అన్ని ఆసుప‌త్రుల నోటీసు బోర్డుల్లో ఉంచాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్రై వేటు ఆసుపత్రుల చికిత్సలు, ఫీజుల దోపిడీపై ఫిర్యాదు చేసేందుకు వెంటనే వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీక‌ర‌ణ కోసం ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. గర్భిణులకు ఆసుపత్రుల్లో అడ్మిషన్‌ సహా ఇతర చికిత్సల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఓ గర్భిణి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోలేదన్న కారణంగా పలు ఆసుపత్రులకు తిరిగినా అడ్మిషన్‌ ఇవ్వకపోవడంతో మృత్యువాతపడిన విషయాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డి ప్రస్తావించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదు అని చెప్పారు. కరోనా చికిత్సలో భాగంగా స్వల్ప లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న మందుల కిట్‌ లో స్టెరాయిడ్స్‌ కూడా ఉంటున్నాయని, రోగిని పరీక్షించకుండా స్టెరాయిడ్స్‌ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్టెరాయిడ్స్‌ వాడడం ద్వారా దుష్పలితాలు ఉంటాయని, బ్లాక్‌ ఫంగస్‌ లాంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని కోర్టు చెప్పింది.

రోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని, పరీక్షల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని, ఇటీవల 65 వేలకు మించి పరీక్షలు చేయడం లేదంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌ 1కి వాయిదా వేసింది. ఇక క‌రోనా థార్డ్ వేవ్ పొంచి ఉన్ననేప‌థ్యంలో క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెల‌పాల‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. అలాగే 45 ఏళ్లు దాటిన వారితోపాటు 18–45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల‌ని ప్రభుత్వాన్ని కోరింది.