Begin typing your search above and press return to search.

కృష్ణా ప‌రివాహ‌క ప్రాజెక్టుల్లో ఎన్నినీళ్లు స్టోరేజీ అయ్యాయంటే..

By:  Tupaki Desk   |   19 Aug 2019 12:54 PM IST
కృష్ణా ప‌రివాహ‌క ప్రాజెక్టుల్లో ఎన్నినీళ్లు స్టోరేజీ అయ్యాయంటే..
X
చాలా ఏళ్ల తర్వాత కృష్ణాన‌ది ఉగ్ర‌రూపం దాల్చింది. ఎగువ‌న మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహించింది. దీంతో కృష్ణానది పరివాహ ప్రాంతాల‌న్నీ కూడా జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంటున్నాయి. ప్ర‌ధానంగా ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. వేలాది టీఎంసీల నీరు స‌ముద్రంలోకి చేరుతోంది. కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లను చూసేందుకు జ‌నం తండోప‌తండాలుగా ప్రాజెక్టుల వ‌ద్ద‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ఆ సుంద‌ర దృశ్యాల‌ను చూసి ఆనంద‌ప‌డుతున్నారు. ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ వ‌రద‌ల‌తో కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాజెక్టుల్లో ఎన్ని నీళ్లు స్టోరేజీ అయ్యాయో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం...

ఇక్క‌డ ప్ర‌ధానంగా కర్ణాటకలోని నారాయణపూర్‌, ఆల్మట్టి డ్యామ్ లు పూర్తిగా నిండిపోయాయి. ఇక దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల‌కు భారీగా వ‌ర‌ద వ‌చ్చి చేరింది. జూరాల- శ్రీశైలం- నాగార్జునసాగర్- పులిచింతల- ప్రకాశం బ్యారేజీలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో జూరాల పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం అక్కడ 11 టీఎంసీలు గాను 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ లోకి వరదనీరు పోటెత్తడంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తేశారు.

885 అడగుల గరిష్ట నీటి మట్టానికి గాను... ప్రస్తుతం 882 అడుగుల మేర నీటిమట్టం ఉంది. 215 టీఎంసీలకు గానీ.... 201 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంలోకి 4లక్షల 21 వేల 869 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా... అవుట్‌ ఫ్లో 5 లక్షల 67 వేల 168 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు అధికారులు.

అక్క‌డి నుంచి నాగార్జున సాగర్ డ్యామ్‌ లో కూడా నీరు నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. నీటి నిల్వ 315 టీఎంసీలు గాను ప్రస్తుతం 302 టీఎంసీల నీరు నిల్వ‌ ఉంది. ఇక వరద ప్రవాహాన్ని అంచనా వేసిన అధికారులు శనివారం గేట్లు మొత్తం ఎత్తారు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత అధికారులు ఇన్ని గేట్ల‌ను ఎత్తారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు జ‌నం భారీగా త‌ర‌లివ‌స్తున్నారు.

ఇక‌ దిగువన ఉన్న పులిచింతల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. 45 టీఎంసీల సామర్ధ్యం ఉన్న పులిచింతలలో ప్రస్తుతం 40 టీఎంసీలకు పైగా నీరు నిల్వ‌ ఉంది. ప్రకాశం బ్యారేజిలో కూడా 4 టీఎంసీల నీరు ఉంది. అలాగే.. హోస్పేట్‌‌లోని తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండిపోయింది. డ్యాం గరిష్ట స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉంది. డ్యాంలోకి 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో.. అధికారులు 20 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.