Begin typing your search above and press return to search.

శరీరంలో వైరస్ ఎంతకాలం యాక్టివ్ గా ఉంటుంది.. షాకింగ్ నిజాలు!

By:  Tupaki Desk   |   30 Jan 2022 6:48 AM GMT
శరీరంలో వైరస్ ఎంతకాలం యాక్టివ్ గా ఉంటుంది.. షాకింగ్ నిజాలు!
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది దాదాపు రెండేళ్ల నుంచి పంజా విసురుతోంది. భారతదేశంలో కొవిడ్ తొలి కేసు నమోదై రెండు సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా వైరస్ విశ్వరూపం కొనసాగుతూనే ఉంది. గ్యాప్ ఇస్తూ దశల వారీగా కోరలు చాస్తోంది. కాగా వైరస్ పై ఇంకా ముమ్మరంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మానవ శరీరంలో వైరస్ ఎంత కాలం పాటు ఉంటుందనే అంశంపై అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. అందుకు సంబంధించిన అధ్యయన ఫలితాలు ఫ్రాంటియర్స్ ఆఫ్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. అందులో విస్తుపోయే అంశాలను ప్రస్తావించారు.

కరోనా వైరస్ సోకిన 14 రోజుల తర్వాత దాని నుంచి మనం కోలుకుంటున్నాం అని భ్రమపడుతున్నాం. అయితే ఈ మహమ్మారి కేవలం 14 రోజుల్లోనే కాదు నెలల తరబడి ఉండే అవకాశం ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. కొందరిలో ఏకంగా నెలలకు పైగా యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించామని చెబుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే 232 రోజుల వరకు వైరస్ క్రియాశీలకంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. పైకి లక్షణాలు కనిపించకపోయినా... మనిషి శరీరంలోని పలు వ్యవస్థలపై మాత్రం ప్రభావం చూపుతాయని వారు అభిప్రాయపడ్డారు.

బ్రెజిల్ లోని కరోనా బాధితులపై పరీక్షలు జరిపినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారికి నెగిటివ్ వచ్చేదాకా ఒక్కొక్కరికి రెండు, మూడు సార్లకు పైగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిపామని తెలిపారు. వారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ శరీరంలో వైరస్ 70 రోజుల పాటు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. బాధితుల్లో 8 శాతం మందిలో వైరస్ రెండు నెలలకు పైగా క్రియాశీలకంగా ఉంటోందని పేర్కొన్నారు. ఓ 38 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకిందని... 20 రోజుల పాటు స్వల్ప లక్షణాలు గుర్తించినట్లు చెప్పారు. ఆ తర్వాత 232 రోజుల పాటు అతడి శరీరంలో యాక్టివ్ గానే ఉందని వివరించారు. ఆయన శరీరంలో వైరస్ వివిధ మార్పులు చెందిందని.. మ్యూటేషన్లు జరిగాయని చెప్పారు.

వైరస్ సోకిన 14 రోజుల తర్వాత కూడా వైరస్ ఇతరులకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరిలో 71 నుంచి 232 రోజుల దాకా కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి కేసులో బాధితులకు ఎలాంటి లక్షణాలు ఉండవు అని చెప్పారు. అయినా కూడా వారు ఇతరులకు వైరస్ వ్యాప్తి చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాబట్టి ఎటువంటి లక్షణాలు లేకున్నా... మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. మరి కొన్నాళ్ల పాటు మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మరోవైపు దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే మరణాల రేటు అంత ప్రమాదకరంగా లేకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది.