Begin typing your search above and press return to search.

తిరుమల దర్శనం 10 నిమిషాల్లో అయిపోయిందంట..!

By:  Tupaki Desk   |   10 Jun 2020 3:45 AM GMT
తిరుమల దర్శనం 10 నిమిషాల్లో అయిపోయిందంట..!
X
సుధీర్ఘ లాక్ డౌన్ తర్వాత దాదాపు 80రోజులకు జూన్ 8న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆలయ తలుపులను తీశారు. దీంతో భక్తుల రాక మొదలైంది. లాక్ డౌన్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో ప్రస్తుతం భక్తులను జాగ్రత్తలు తీసుకొని దర్శనాలకు అనుమతిస్తున్నారు. కానీ కరోనా భయంతో జనాలు పెద్దగా రాకపోయే సరికి దర్శనానికి పట్టే సమయం భారీగా తగ్గిందని భక్తులు చెబుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ఇంత సుదీర్ఘకాలం సాధారణ భక్తులకు ఆలయ ప్రవేశం దూరం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

లాక్ డౌన్ తో భక్తులు ఇన్నాళ్లు లేక తిరుమల కొండలపై అడవి జంతువులు స్వేచ్ఛగా తిరిగాయి. ఇక వాహనాల రాకపోకలు లేకపోవడంతో టీటీడీ బోర్డు ఘాట్ రోడ్లపై రక్షణ చర్యలు చేపట్ింది. ఇక ఆలయ క్యూలైన్లలోనూ భారీ మార్పులు చేసింది. మార్కింగ్ చేసింది. శానిటైజర్లు అందుబాటులో ఉంచింది. మాస్కులు, గ్లౌజులు ధరించేలా సిబ్బందిని సన్నద్ధం చేసింది.

గంటకు 500మంది చొప్పున రోజుకు 13గంటల పాటు 6500 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. సరిగ్గా 10 నిమిషాల్లో దర్శన భాగ్యం కలుగుతోందని భక్తులు అంటున్నారు.

నిత్యం రద్దీగా ఉండే తిరుమల కొండలు ఇప్పుడు ఖాళీగా వీధులు ప్రశాంతంగా ఉన్నాయి. వ్యాపారాలు, దుకాణాలు తెరవలేదు. కొండపైన ప్రసాదంలో మాత్రమే ఆహారం లభిస్తోంది. మిగతా ఎక్కడా దుకాణాలు తెరవలేదు. నిత్యాన్నదాన సత్రంలో భోజనం పెడుతున్నారు. భౌతిక దూరం పాటించేలా సీటింగ్ లో మార్పు చేశారు.

ప్రధాన ఆలయానికి వచ్చే సరికి రెండు చోట్ల చెకింగ్ లు - నాలుగు చోట్ల శానిటైజర్లు అందిస్తున్నారు. తోపులాటలు, ఇరుకుగా ఆదరబాదరగా లేకుండా సులభంగా స్వేచ్ఛగా చాలా సేపు దాదాపు 2 నిమిషాల పాటు తిరుమలేషుడిని దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతోంది.