Begin typing your search above and press return to search.

బ్యాలెట్ బాక్సులు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు ?

By:  Tupaki Desk   |   5 Nov 2020 10:30 AM IST
బ్యాలెట్ బాక్సులు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వించాలని గట్టి పట్టుదలతో ఉన్నారే కానీ దానికి అవసరమైనవి ఏవీ ఎలక్షన్ కమీషన్ దగ్గర లేవు. ఎన్నికలను నిర్వహించాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది సిబ్బంది+బ్యాలెట్ బాక్సులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల నిర్వహణ అంటేనే సిబ్బంది లక్షల్లో అవసరమవుతారు.

పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, వారి మీద సూపర్ వైజ్ చేసే అధికారులు, రూటు ఆఫీసర్లు ఇలా.. అనేక స్ధాయిలో సిబ్బంది అవసరం అవుతారు. వీళ్ళు కాకుండా శాంతి భద్రతలను మెయిన్ టైన్ చేయాల్సిన పోలీసులు కూడా వేలల్లోనే అవసరం అవుతారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర తక్కువలో తక్కువ ఓ ఐదుమంది పోలీసులు అవసరమని ఓ అంచనా. సరే పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని పక్కనపెట్టేస్తే బ్యాలెట్ బాక్సులు కూడా చాలా అవసరమే. ప్రస్తుత కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని ఈవీఎంల స్ధానంలో బ్యాలెట్ బాక్సులను వాడాలని కమీషన్ నిర్ణయించింది.

ప్రతి పోలింగ్ కేంద్రంలోను కనీసం రెండు బ్యాలెట్ బాక్సుల అవపరం ఉంది. అంటే బాక్సులు కూడా లక్షల్లోనే అవసరం అవుతాయన్న విషయం అర్ధమవుతోంది. మరి ఏపి దగ్గర ఎన్ని బాక్సులున్నాయి ? ఎన్నింటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అందుకనే మార్చిలో జరిగిన ఎన్నికలకు అవసరం అని తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి బ్యాలెట్ బాక్సులను అరువు తెచ్చుకున్నది కమీషన్. ఎప్పుడైతే ఎన్నికలు వాయిదాపడ్డాయో వెంటనే తెలంగాణా ప్రభుత్వ తానిచ్చిన బాక్సులను వెనక్కు తీసేసుకుంది. పైగా ఇపుడు తెలంగాణాలో కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు కాబట్టి ఏపికి ఇవ్వటం సాధ్యం కాదని చెప్పేసింది.

ఇదే విషయమై దక్షిణాది రాష్ట్రాలను సంప్రదిస్తే ఏ రాష్ట్రం కూడా సానుకూలంగా స్పందిచలేదని స్వయంగా నిమ్మగడ్డే కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టంగా చెప్పారు. బ్యాలెట్ బాక్సుల కోసం ఎన్నిసార్లు సంప్రదించినా ఎవరు పట్టించుకోలేదని, ప్రయోజనం లేకపోయిందని నిమ్మగడ్డే చెప్పారు. అంటే ఒకవైపు కరోనా వైరస్ కారణంగా సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ఇదే సమయంలో పోలింగ్ కు లక్షల సంఖ్యలో అత్యవసరమైన బ్యాలెట్ బాక్సులూ లేవు. మరి స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎలా నిర్వహించాలని నిమ్మగడ్డ అనుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

నిమ్మగడ్డ వ్యవహారం చూస్తుంటే ఏదో పద్దతిలో తాను పదవిలో నుండి దిగిపోయేలోగానే ఎన్నికలను నిర్వహించేయాలని ప్రభుత్వం మీద పంతంతో వ్యవహరిస్తున్నట్లే అనుమానంగా ఉంది. ప్రభుత్వంతో సఖ్యతగా ఉండుంటే అసలు ఇన్ని సమస్యలు తలెత్తేవే కాదన్న విషయన్ని నిమ్మగడ్డ మరచిపోయారు. ఎంతసేపు తాను రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నాను అన్న ఇగోతోనే ప్రభుత్వంతో కోరి సమస్యలు తెచ్చుకుంటున్నట్లే కనబడుతోంది.