Begin typing your search above and press return to search.

గల్వాన్ ఘటనపై చైనా యూత్ ఎలా ఉన్నారు?

By:  Tupaki Desk   |   23 Jun 2020 4:15 AM GMT
గల్వాన్ ఘటనపై చైనా యూత్ ఎలా ఉన్నారు?
X
సరిహద్దుల్లో డ్రాగన్ దుర్మార్గానికి కల్నల్ తో సహా ఇరవైమంది సైనికులు మరణించటం తెలిసిందే. ఈ ఉదంతం బయటకు వచ్చింతనే భారతదేశ ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురికావటమే కాదు.. చైనాకు బలంగా బదులివ్వాలన్న మాట వినిపించింది. చైనా వస్తువుల్ని బ్యాన్ చేయటంతో పాటు.. ప్లేస్టోర్ లోకి వెళ్లి.. తమ మొబైళ్లలో ఉన్న చైనీస్ యాప్ లను డిలీట్ చేసేస్తున్నారు. చైనా వస్తువుల్ని వాడకూడదని గట్టిగా నిర్ణయించుకుంటున్న వారికి కొదవ లేదు. మన దగ్గర యూత్ మొదలుకొని పండుటాకుల వరకూ చైనాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వేళ.. చైనాలో ఎలాంటి పరిస్థితి ఉంది?

అక్కడి యూత్ ఏం కోరుకుంటున్నారు? వారి వేదన ఏమిటి? చైనా ప్రభుత్వానికి వారి డిమాండ్లు ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. గల్వాన్ లోయలో జరిగిన ఘటనలో తమ సైనికులు ఇరవై మంది మరణించినట్లుగా ప్రకటించటమే కాదు.. వారి అంతిమ సంస్కారాలు గౌరవ లాంఛనాలకు ఏ మాత్రం లోటులేకుండా నిర్వహించారు. అదే సమయంలో చైనాకు చెందిన 45 మంది మరణించినట్లుగా వార్తలు వచ్చినా.. చైనా మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.

దీంతో.. బయటకు వస్తున్న తమ సైనికుల మరణాలపై చైనా యువత తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని ఎందుకు దాచారన్న ప్రశ్నను పలువురు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది మరణించారన్న విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏమిటన్నది వారి ప్రశ్న. ఈ ఒత్తిడి ఎక్కువైన నేపథ్యంలో చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ సైతం తమ సైనికులు మరణించినట్లుగా ఎట్టకేలకు ఒప్పుకోక తప్పలేదు. కాకుంటే.. ఎంతమంది మరణించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఒత్తిళ్లు.. విమర్శలు పెరిగిన నేపథ్యంలో చైనా సైన్య కమాండింగ్ అధికారి జూన్ 15నాటి ఘటనలో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. మిగిలిన వారి వివరాలు బయటకు రానివ్వట్లేదు. ఈ తీరును చైనీయులు తమ దేశ ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నిస్తున్నారు. ఓవైపు భారత్ ప్రభుత్వం మరణించిన వారి వివరాల్ని వెల్లడిస్తు.. సైనిక లాంఛనాలతో సగౌరవంగా అంత్యక్రియులు నిర్వర్తిస్తున్న వేళ.. తమ సైనికులకు అలాంటి గౌరవం దక్కట్లేదన్న ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు.

సరిహద్దుల్లో ఇరవైఏళ్ల యువకుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని.. ఇంట్లో ఏకైక సంతానం ఉన్న వారిపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులకైనా మరణ వార్తను చేరవేయాల్సి ఉంటుందన్న మాట పలువురి నోటి నుంచి రావటం గమనార్హం. అంతేకాదు.. మరణించి వారి వివరాల్ని దాచి పెట్టటం ద్వారా వేలాదిగా ఉన్న సైనిక కుటుంబాల్లో ఇప్పుడు సరికొత్త ఆందోళన వ్యక్తమవుతోంది. బయటకు చెప్పుకోలేని రీతిలో మానసిక వేదనను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. గల్వాన్ ఉదంతంలో వీర మరణం పొందిన భారత సైనికులకు దక్కిన అధికారిక నివాళి.. చైనీయుల్ని మరింత వేదనకు గురి చేస్తోందన్న మాట వినిపిస్తోంది. దీనికి చెక్ పెట్టకుంటే చైనా ప్రభుత్వానికి కొత్త సవాళ్లు ఎదరయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.