Begin typing your search above and press return to search.

హరికృష్ణ పార్థివ దేహంతో సెల్ఫీ..నెటిజన్ల ఫైర్‌!

By:  Tupaki Desk   |   31 Aug 2018 12:51 PM GMT
హరికృష్ణ పార్థివ దేహంతో సెల్ఫీ..నెటిజన్ల ఫైర్‌!
X
``మాయ‌మైపోతు న్నాడ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు.....మ‌చ్చుకైనా లేడు చూడు...మాన‌వ‌త్వం ఉన్న‌వాడు``......ప్ర‌ముఖ క‌వి అందెశ్రీ అన్న మాటలు అక్ష‌ర స‌త్యాల‌వుతున్నాయి. ఆధునిక స‌మాజంలో మ‌నుషుల్లోని మాన‌వత్వ‌పు విలువ‌లు నానాటికీ దిగ‌జారిపోతున్నాయి. న‌డిరోడ్డుపై రోడ్డు ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కాపాడుకోవ‌డం కోసం పోరాడుతున్న వారు ఒక ప‌క్క‌....ఆ ఘోర ప్ర‌మాద దృశ్యాల‌ను - క్ష‌తగాత్రుల ఆర్త‌నాదాల‌ను మెరాల‌లో బంధించి పైశాచికానందం పొందేవారు మ‌రోపక్క....ప్ర‌స్తుత‌ స‌మాజంలో ఇటువంటి ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. అయితే, రాను రాను ఈ వీడియోల గోల‌ - సెల్ఫీల పిచ్చ ప‌రాకాష్ట‌కు చేరింద‌న‌డానికి తాజాగా జ‌రిగిన ఓ దుర్ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. సాటి మ‌నిషి చ‌నిపోయాడ‌న్న క‌నీస జాలి - ఓ శ‌వం ప‌క్క‌న ఉన్నామ‌న్న స్పృహ లేకుండా మ‌నుషులు ఎంత‌కు దిగ‌జార‌తార‌నేందుకు నిలువెత్తు తార్కాణం. మాజీ ఎంపీ, సినీ న‌టుడు హ‌రికృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణం పాలై ....ఆయ‌న కుటుంబం - అభిమానులు శోక సంద్రంలో ఉంటే.....ఆయ‌న పార్థివ దేహం ప‌క్క‌న సెల్ఫీలు దిగి కొంద‌రు వికృతానందం పొందారు. అంతేకాదు, తామేదో ఘ‌న‌కార్యం చేసిన‌ట్లు ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు వైర‌ల్ కావ‌డంతో....నెటిజ‌న్లు ఆ సెల్ఫీలు దిగిన వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

సోష‌ల్ మీడియా విస్తృతంగా వాడుతున్న ఈ రోజుల్లో సెల్ఫీలు - సెల్ఫీ వీడియోల పోక‌డ ఎక్కువైంది. సోష‌ల్ మీడియాలో లైకులు - షేర్ల కోసం...ఆఖ‌రికి ప్రాణాల‌కు తెగించి మ‌రీ సెల్ఫీలు తీసుకోవ‌డం ఈ రోజుల్లో ఫ్యాష‌న్ అయిపోయింది. వేగంగా వ‌స్తోన్న రైలుకు అతి స‌మీపం నుంచి......ఎత్తైన జ‌ల‌పాతాలు - కొండ‌ల చివ‌రంచుల‌పై నుంచి....మ‌రెన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాంతాలలో సెల్పీలు దిగి ప్రాణాలు పోగొట్టుకున్న ఘ‌ట‌న‌లు అనేకం. అయినా, వినాశ‌కాలే....విప‌రీత బుద్ధి అన్న‌ట్లు....సెల్ఫీల పిచ్చి మాత్రం కొంద‌రికి త‌గ్గ‌ట్లేదు. అయితే, క‌లికాల‌మో...పోయే కాల‌మో తెలీదు గానీ...రాను రాను... సెల్ఫీల‌ పిచ్చి పరాకాష్టకు చేరింది. అస‌లు ఏ సంద‌ర్భంలో ఎవ‌రితో సెల్ఫీ దిగాలి....ఏ స‌య‌యంలో దిగ‌కూడ‌దు అన్న క‌నీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొంత‌మంది ప్ర‌వ‌ర్తించ‌డం దుర‌దృష్ట‌క‌రం.

రెండు రోజుల క్రితం హ‌రికృష్ణ ఘోర రోడ్డు ప్ర‌మాదానికి గురై హ‌ఠాన్మ‌ర‌ణం పాల‌య్యార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు - టీడీపీ కార్య‌క‌ర్త‌లు - అభిమానులు - ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే, ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత హ‌రికృష్ణ‌ను త‌ర‌లించిన నార్కట్‌ పల్లి కామెనేని ఆసుపత్రిలోని కొంద‌రు సిబ్బంది మాత్రం...హ‌రికృష్ణ చ‌నిపోయినందుకు బాధ‌ప‌డ‌క‌పోగా....త‌మ పైశాచికానందాన్ని చాటుకున్నారు. ఆ ఆసుప‌త్రిలో పనిచేసి న‌లుగురు సిబ్బంది......హరికృష్ణ పార్థివ దేహంతో సెల్ఫీలు దిగి వికృతానందం పొందారు. అంతటితో ఆగకుండా తాము చేసిన ఘ‌న‌కార్యాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేసి రాక్షసానందం పొందారు. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో వారిపై నెటిజన్లు మండిప‌డుతున్నారు. మానవత్వం చనిపోయింద‌ని, అస‌లు ఇలా సెల్ఫీలు నిజంగా దిగారా అని ....ఇంత దారుణంగా మ‌నుషులు త‌యార‌య్యారా.....ఏమాత్రం బుద్ధి లేకుండా అలా సెల్ఫీలు ఎలా దిగార‌ని...ప‌విత్ర‌మైన వైద్య వృత్తిలో ఉంటూ ఇలా సెల్ఫీలు దిగ‌డానికి సిగ్గులేదా అని......నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.