Begin typing your search above and press return to search.

హెచ్ఐవీ కోరలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కేసులు

By:  Tupaki Desk   |   28 Nov 2022 2:30 AM GMT
హెచ్ఐవీ కోరలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కేసులు
X
1990, 2000లలో ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ తర్వాత ఈ అంటువ్యాధి తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగానిర్మూలన కాలేదు. ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హెచ్ఐవీకి వ్యతిరేకంగా పోరాటానికి, హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి మద్దతు అందించేందుకు , ఎయిడ్స్ తో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు వరల్డ్ ఎయిడ్స్ డే ఒక సందర్భం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 3.8 కోట్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేసింది. భారతదేశంలో గత పదేళ్లలో రక్షణ లేకుండా లైంగిక సంపర్కం వలన 17 లక్షల మందికి పైగా ప్రజలకు హెచ్ఐవీ సోకినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తెలిపింది.

అన్ ప్రొటెక్టెడ్ సెక్స్ వలన ఏపీలో 3,18,814 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ (2,84,577), కర్ణాటక (2,12 982), తమిళనాడు (1,16,536) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 2010 నుంచి 2021కి దేశంలో ఎయిడ్స్/హెచ్ఐవీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

భారతదేశంలో 1986లో చెన్నైలో తొలి ఎయిడ్స్ కేసు బయటపడింది. క్రమంగా ఈ అంటువ్యాధి ప్రబలుతుండడంతో 1992లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాన్ని (1992-99) ప్రారంభించారు.

ఒకరికంటే ఎక్కువమందితో శృంగారం.. కలుషిత రక్తమార్పిడి, కలుషిత సిరంజీల వాడకం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. హ్యూమన్ ఇమ్యూనోడెఫిసియెన్సీ వైరస్ కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి రావడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ వ్యాధి మనషులకు మాత్రమే సోకుతుంది. ఎయిడ్స్ ను తగ్గించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం.

మొదటిసారిగా 1981లో అమెరికాలో ఓ వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు గుర్తించారు. వ్యాధిని కనిపెట్టడానికి కొంత సమయం పట్టినా ఈ సమస్య చాలా మందికి ఉందని తేలింది. మొదటిసారి వ్యాధి గుర్తించింది కూడా ఓ వైద్యుడికే కావడం గమనార్హం.

ఇక భారత్ లో ఈ ఎయిడ్స్ మహమ్మారి విస్తరిస్తోందని గణాంకాలు చెబుతున్నారు. భారత్ లో అరక్షిత శృంగారం కారణంగా దేశంలో 17 లక్షల మందికి పైగా హెచ్.ఐ.వీ బారినపడినట్లు జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ తెలిపింది.

ఎయిడ్స్ కేసులకు సంబంధించి మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఈ సంస్థ బదులిచ్చింది.

సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దశాబ్ధ కాలంలో హెచ్.ఐవీ బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 2011-12లో 2.4 లక్షల మందికి హెచ్.ఐవీ సోకింది. 2020-21 నాటికి ఆ సంఖ్య 85268కి తగ్గింది. లైంగిక సంపర్కం సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా భారత్ లో గత పదేళ్లలో 2011-21 మధ్య 17,08,777 మందికి హెచ్ఐవీ సోకింది.

ఇక దేశంలోనే అత్యధికంగా ఎయిడ్స్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. గత పదేళ్లలో కండోమ్ వాడకపోవడం వల్ల ఏపీలో 3,18,814 మందికి హెచ్.ఐవీ సోకింది. మహారాష్ట్రలో 2,84,577. ఆ తర్వాత కర్ణాటకలో 2,12,982 కేసులు.. ఆ తర్వాత తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లు ఉన్నాయి. అలాగే 2011-21 వరకూ రక్తమార్పిడి, ఇతర సంబంధిత కారణాలతో 15782 మంది హెచ్ఐవీ బారినపడ్డారు. ఇక 2011-21 మధ్య 4423మంది చిన్నారులకు తల్లుల నుంచి హెచ్ఐవీ సోకింది.

2021లో ప్రపంచవ్యాప్తంగా 3.8కోట్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉండగా.. ఎయిడ్స్ కారణంగా 6,50,000 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలో తాజాగా 2021 గణాంకాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలోకి దిగజారింది. హెచ్ఐవ బారినపడ్డ వారి సంఖ్యలో మహారాష్ట్ర టాప్ లో ఉంది. ఇదే అత్యధికంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. ఏపీలో 2010 నుంచి హెచ్ఐవీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చినా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 2021 నాటికి ఈ సంఖ్య అధికంగా ఉంది.