Begin typing your search above and press return to search.

విశాఖలో హైడ్రామా: టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ..

By:  Tupaki Desk   |   26 Dec 2020 1:46 PM GMT
విశాఖలో హైడ్రామా: టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ..
X
విశాఖలో రాజకీయ వేడి మరోసారి రగులుకుంది. నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబ ఆలయంలో వైసీపీ నేతలు ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి సవాలు విసిరారు. దీంతో శనివారం విశాఖ నగరంలో హైడ్రామా నడిచింది.

సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేయడానికి ఇరుపక్షాలు భారీగా తరలిరావడంతో విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

విశాఖ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద మూడంచెల పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇటు వైఎస్సార్‌సీపీ నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ విజయనిర్మల వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆ తర్వాత వెలగపూడి కార్యాలయం వైపు వైఎస్సార్‌సీపీ నేతలు సాయిబాబు ఫోటో తీసుకెళ్లారు. ఎంవీపీ కాలనీ మెయిన్ రోడ్డు దగ్గర విజయ నిర్మలను పోలీసులు అడ్డుకున్నారు.. అనుమతి లేదన్నారు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.

వైఎస్సార్‌సీపీ నిరసనపై ఎమ్మెల్యే వెలగపూడి స్పందించారు. తాను ఎంపీ విజయసాయిరెడ్డిని రమ్మన్నానని.. ఆయన వస్తే ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని సవాల్ చేశారు. దీంతో విశాఖలో టీడీపీ, వైసీపీ ఫైట్ ఉద్రిక్తతలకు దారితీసింది.