Begin typing your search above and press return to search.

తిరుపతి ఉప ఎన్నికకు ముందే కర్నూలుకు హైకోర్టు

By:  Tupaki Desk   |   18 Dec 2020 11:20 AM IST
తిరుపతి ఉప ఎన్నికకు ముందే కర్నూలుకు హైకోర్టు
X
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక.. వచ్చే ఏడాది జరగనుంది. సిట్టింగ్ ఎంపీ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీ రాజకీయాల్ని తాజా ఉప ఎన్నిక ప్రభావితం చేయనుందని చెబుతున్నారు. ఈ ఉప ఎన్నిక ప్రత్యేకత ఏమంటే.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. సర్వేపల్లి.. గూడూరు.. సూళ్లురుపేట.. వెంకటగిరి.. తిరుపతి.. శ్రీకాళహస్తి.. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజల తీర్పు.. కొత్త పరిణామాలకు తెర తీస్తుందని చెప్పాలి.

అయితే.. ఈ ఉప ఎన్నికకు కాస్త ముందే మరో కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెబుతున్నారు. ఏపీ రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరించాలని జగన్ సర్కారు నిర్ణయించటం తెలిసిందే. న్యాయ రాజధానిగా కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేయాలని.. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని భావించటం తెలిసిందే. హైకోర్టు మార్పుపై ఇప్పటికే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే..కర్నూలుకు హైకోర్టు తరలివెళుతుందని చెబుతున్నారు.

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన హామీ పొందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికకు ముందే ఈ మార్పు జరుగుతుందంటున్నారు. అదే జరిగితే.. ఉప ఎన్నిక ఏపీ అధికారపక్షానికి మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నట్లుగా అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కలగాలన్న ఉద్దేశంతో తీసుకుంటున్న నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో.. ఏపీలో తన బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి మేలు జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.