Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్ర‌భుత్వానికి దిమ్మ‌దిరిగే షాక్‌

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:37 PM GMT
తెలంగాణ ప్ర‌భుత్వానికి దిమ్మ‌దిరిగే షాక్‌
X
తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. మ‌ల్ల‌న్న సాగ‌ర్ స‌హా తెలంగాణలో చేప‌డుతున్న ప్రాజెక్టుల విష‌యంలో దూకుడుగా వెళ్తున్న ప్ర‌భుత్వానికి చెక్ పెడుతూ.. ప్రాజెక్టుల కోసం భూమిని సేక‌రించేందుకు తీసుకొచ్చిన 123.. 124 జీవోల‌ను కొట్టి వేస్తూ ఉమ్మ‌డి హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ప్రాజెక్టుల‌ నిర్వాసితులకు పరిహారం.. చెల్లింపులకు సంబంధించి గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో తేగా.. దీన్ని సవాలు చేస్తూ కరీంనగర్ జిల్లా చందుర్తి మండలానికి చెందిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిష‌న్ ను విచారించిన హైకోర్టు 2013 భూ సేకరణ చట్టం ఉండగా.. కొత్త‌గా 123 జీవో ఏంట‌ని.. దీని ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసుకుంటార‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. జీవోలో అనేక లోపాలున్నాయ‌న్న రైతులు వాద‌న‌తో ఏకీభ‌వించిన హైకోర్టు.. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టాన్నే అనుస‌రించాల‌ని పేర్కొంది. కొత్త జీవో ప్ర‌కారం రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని.. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా నష్టం పరిహారం చెల్లించాలని హైకోర్టు సూచించింది.

ఈ తీర్పుతో మ‌ల్ల‌న్న సాగ‌ర్ స‌హా అనేక ప్రాజెక్టుల విష‌యంలో తెలంగాణ స‌ర్కారుకు ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లే. హైకోర్టు తీర్పుపై ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవ‌కాశ‌ముంది. ఈ తీర్పు రాగానే కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు గాంధీ భవన్లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకోవ‌డం విశేషం. మ‌రోవైపు తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ తీర్పు తెలంగాణ ప్ర‌భుత్వానికి గుణపాఠం లాంటిదని అన్నారు. ప్రభుత్వ తప్పిదాన్ని హైకోర్టు చక్కదిద్దిందని.. ఈ తీర్పును లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.