Begin typing your search above and press return to search.

కీలక వ్యాఖ్య చేసిన హైకోర్టు.. థ్యాంక్స్ టు సిద్ధలక్ష్మి

By:  Tupaki Desk   |   6 March 2020 4:04 AM GMT
కీలక వ్యాఖ్య చేసిన హైకోర్టు.. థ్యాంక్స్ టు సిద్ధలక్ష్మి
X
భయానికి మించింది మరేది ఉండదు. ఎంత డబ్బున్నా.. మరెంత పవర్ ఉన్నా.. భయం దాన్ని డామినేట్ చేసేస్తుంది. పెద్ద పెద్దోళ్లు సైతం చిన్న పిల్లల మాదిరి వణికిపోవటం భయం తో మాత్రమే సాధ్యం. అలాంటి భయాన్ని పుట్టించటంలో కరోనాకు మించింది మరొకటి లేదని చెప్పాలి. భయాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే స్వార్థపరులు మన దగ్గర ఎంత ఎక్కువన్నది.. మాస్కుల ధరల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. నిన్న మొన్నటివరకూ రెండు.. మూడు రూపాయిలు పలికిన పల్చటి మాస్కులు ఈ రోజున పాతిక రూపాయిల నుంచి ముప్ఫై రూపాయిలు పలుకుతున్న దుస్థితి.

జనాల రక్తాన్ని పీల్చే ఈ తరహా వ్యాపార జలగలకు బుద్ధి చెప్పేలా హైకోర్టు రియాక్ట్ అయ్యేలా చేశారో మహిళ. తన పిటిషన్ తో మాస్కుల అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఆసక్తికర సూచన చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు సిద్ధలక్ష్మి అనే మహిళ. తెలంగాణలో కరోనా తొలి కేసు నమోదైన నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు రెండో రోజు విచారణ చేసింది. ఈ సందర్భంగా మురికివాడల్లోని పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత మాస్కులు.. శానిటైజర్లు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది.

ప్రధాన బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లలోనూ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పింది. పనిలో పనిగా.. రూపాయి వస్తువును పది రూపాయిలకు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న వ్యాఖ్యను చేస్తే మరింత మేలు జరిగే వీలుంది. ఏమైనా.. కరోనాపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేయటానికి కారణమైన సిద్దలక్ష్మి అందరూ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది.