Begin typing your search above and press return to search.

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   19 Feb 2021 8:00 PM IST
ఏబీ వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్ లో ఏసీబీ, సీఐడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ వేయడానికి ఇంత జాప్యం ఎందుకు అని ప్రశ్నించింది.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం ఆరోపించి ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనపై చర్యలకు సిద్దమైంది.

దీంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా గతంలోనే హైకోర్టు ఏసీబీ, సీఐడీని ఆదేశించింది.అయితే ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సమాయానికి కౌంటర్ దాఖలు చేయకుంటే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ఏబీ అరెస్ట్ విషయంలో తొందరపాటుగా వ్యవహరించవద్దని.. పోలీసులను గతంలోనే ఆదేశించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా ఫైల్ చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.దీంతో హైకోర్టు విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.