Begin typing your search above and press return to search.

కర్నూలుకు తరలించే నిర్ణయంపై ఏపీ సర్కారుకు హైకోర్టు ఏం చెప్పిందంటే?

By:  Tupaki Desk   |   1 Sep 2021 4:39 AM GMT
కర్నూలుకు తరలించే నిర్ణయంపై ఏపీ సర్కారుకు హైకోర్టు ఏం చెప్పిందంటే?
X
మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలో.. దాని విచారణ పూర్తి అయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు.. హైదరాబాద్ నుంచి తరలించే కార్యాలయాల్ని కర్నూలుకు కాకుండా.. విజయవాడకే తీసుకురావాలని పేర్కొనటం గమనార్హం. తాజాగా వెల్లడైన ఆదేశాల్ని చూస్తే.. మూడు రాజధానులపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో నడుస్తున్న కేసులు కొలిక్కి వచ్చే వరకు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పక తప్పదు.

విభజన వేళ హైదరాబాద్ లోనే ఉండిపోయి.. ఏపీకి రాని కొన్ని కార్యాలయాన్ని ఎందుకు రాలేదంటూ హైకోర్టు ప్రశ్నించగా.. దానికి సమాధానంగా తాజాగా మానవ హక్కుల సంఘం.. లోకాయుక్త కార్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రయత్నాన్ని జగన్ సర్కారు షురూ చేసింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయా కార్యాలయాన్ని న్యాయ రాజధానిగా నిర్ణయించిన కర్నూలుకు తరలిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది.

దీంతో.. సదరు కార్యాలయాల తరలింపు ప్రక్రియ మొదలైంది. దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును పలువురు ఆశ్రయంచారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానుల విషయం కోర్టు విచారణలో ఉందని.. ఇలాంటివేళలో.. కర్నూలుకు ఆఫీసులు తరలించే నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. మూడు రాజధానుల అంశం తేలే వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

దీంతో.. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికి వీల్లేని పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఏపీ హెచ్ ఆర్ సీ.. లోకాయుక్త కార్యాలయాల్ని కర్నూలుకు తరలించే విషయంలో జగన్ సర్కారు జారీ చేసిన ఆదేశాలు.. గెజిట్ నోటిఫికేషన్లు మొత్తం మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.. దీంతో.. ఒకవేళ ఇప్పుడు కర్నూలుకు తరలించినా.. అది తాత్కాలికమే అవుతుంది. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పు భిన్నంగా ఉంటే.. ఈ ఆఫీసుల్ని మళ్లీ మార్చాల్సి ఉంటుందని.. ఏమైనా తరలింపు మొత్తం తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది. దీనికి తగ్గట్లు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటివేళ.. జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.