Begin typing your search above and press return to search.

సైన్యం కాల్పుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హిజ్బుల్‌

By:  Tupaki Desk   |   2 Nov 2020 7:00 PM IST
సైన్యం కాల్పుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హిజ్బుల్‌
X
జమ్ముకశ్మీర్‌లో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సైఫుల్లా కన్నుమూశాడు. శ్రీనగర్‌ సరిహద్దులో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాలు మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ ‌లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు శనివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు దాగినట్లు అనుమానించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలు కాల్పులు జరుపగా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌ కమాండర్‌ సైఫుల్లా అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

ఈ ఏడాది మేలో హిజ్బుల్‌ చీఫ్‌గా ఉన్న రియాజ్‌ నైకూ భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో 31 సంవత్సరాల డాక్టర్ సైఫుల్లా ఆ బాధ్యతలు చేపట్టాడు. పుల్వామా జిల్లా మలంగ్‌పోరాకు చెందిన సైఫుల్లా మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేయడంతో.. ఇతడిని డాక్టర్‌ అని పిలుస్తుంటారు. 2014 అక్టోబర్ ‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్ ‌లో చేరాడు. కశ్మీర్‌ లోయలో భద్రతాబలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న సైఫుల్లా మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు. సైఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్‌ శివారులోని రంగ్రేత్‌ ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారి పైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు, సైన్యం స్వాధీనం చేసుకుంది. జమ్మూ-కాశ్మీర్ లోయలో ఇప్పటివరకు జరిగిన అనేక కాల్పులు, పేలుళ్ళు తదితరాల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులున్న విషయం అందరికీ తెలిసిందే. పొరుగునున్న పాకిస్ధాన్ సరిహద్దుల్లో నుండి రెగ్యులర్ గా తీవ్రవాదులు భారత్ సరిహద్దుల్లోకి చొరబడుతున్నారు. ఇలా కాశ్మీర్ లోయలోకి వచ్చే ఉగ్రవాదులందరికీ హిజ్బుల్ ముజాహిద్దీనే ఆశ్రయం కల్పిస్తోందంటూ స్ధానిక పోలీసులు ఆరోపణలు చేస్తుంటారు. జమ్మూ కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ మట్లాడుతూ.. పుల్వామా జిల్లాలోని మలంగ్‌ పోరాకు చెందిన అతడు 2014 అక్టోబర్‌ లో హిజ్బుల్ ముజాహిదీన్‌ లో చేరినట్లు తెలిపారు. ‘సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు. పోలీసులకు, భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం’అని ఎన్ ‌కౌంటర్‌ ప్రాంతాన్ని పరిశీలించిన విజయ్‌ కుమార్‌ అభివర్ణించారు.