Begin typing your search above and press return to search.

భ‌ర‌త్ అనే నేను గుర్తుకొచ్చేలా ఆ రాష్ట్రంలో ఫైన్లు!

By:  Tupaki Desk   |   7 July 2019 10:51 AM IST
భ‌ర‌త్ అనే నేను గుర్తుకొచ్చేలా ఆ రాష్ట్రంలో ఫైన్లు!
X
కొద్దికాలం క్రితం టాలీవుడ్ లో మంచి విజ‌యం సాధించిన మ‌హేశ్ బాబు లీడ్ రోల్ చేసిన భ‌ర‌త్ అనే నేను మూవీ గుర్తుందిగా? ఈ సినిమాలో ఫారిన్ నుంచి తెలుగు రాష్ట్రానికి వ‌చ్చిన హీరో అనూహ్యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కావ‌టం.. భ‌యం భ‌క్తి లేకుండా సాగే ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు భారీగా ఫైన్లు వ‌డ్డించ‌టం తెలిసిందే. ఈ ఫైన్ల లెక్క‌పై త‌ర్వాతి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారుల చ‌ర్చ‌ల్లో కూడా ప్ర‌స్తావ‌నకు వ‌చ్చింది. తాజాగా ముంబ‌యిలో ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల విష‌యంలో కొత్త‌గా అమ‌లు చేయ‌నున్న జ‌రిమానాల లెక్క వింటే భ‌ర‌త్ అనే నేను సినిమా చ‌ప్పున గుర్తుకు రాక మాన‌దు.

ఈ సినిమాను చూసి కొత్త ఫైన్ల‌ను ఫిక్స్ చేశారా? అన్న డౌట్ వ‌చ్చేలా ఉన్నాయి. బృహ‌న్ ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్.. ముంబ‌యి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా అమలు చేయ‌నున్న కొత్త ట్రాఫిక్ నిబంధ‌న‌లు త‌ప్పు చేసే వారికి దిమ్మ తిరిగిపోవ‌ట‌మే కాదు.. త‌ప్పు చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌ని రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

రేప‌టి నుంచి (సోమ‌వారం) ముంబ‌యిలో క‌ఠిన‌మైన ట్రాఫిక్ రూల్స్ అమ‌ల్లోకి రానున్నాయి. నో పార్కింగ్ జోన్ లో కారును నిలిపితే ఇప్ప‌టివ‌ర‌కూ విధిస్తున్న రూ.5వేలు కాస్తా రూ.23వేల‌కు పెంచేశారు. ప్ర‌భుత్వం గుర్తించిన 26 పార్కింగ్ ప్ర‌దేశాల్లో జ‌రిగే ఉల్లంఘ‌న‌ల‌పై ఈ భారీ జ‌రిమానాలు విధిస్తారు.

కొత్త‌గా అమ‌ల్లోకి వ‌చ్చిన రూల్స్ ప్ర‌కారం టూవీల‌ర్ ను రాంగ్ పార్కింగ్ లో ఆపితే రూ.5వేల నుంచి రూ.8,300 వ‌ర‌కు ఫైన్ వేయ‌నున్నారు. ఇక‌.. భారీ వాహ‌నాల విష‌యంలో రూ.15 వేల నుంచి రూ.23,250 వ‌ర‌కు వ‌డ్డించ‌నున్నారు. ఇక‌.. మ‌ధ్య‌శ్రేణి వాహ‌నాల మీద రూ.11వేల నుంచి రూ17,600 వ‌ర‌కు లైట్ వెహికిల్స్ కు రూ.10వేల నుంచి రూ.15,100 వ‌ర‌కు ఫైన్ వేయ‌నున్నారు. అదే ఆటోవాలాలు ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తే రూ.8వేల నుంచి రూ.12,200 వ‌ర‌కూ ఫైన్ వేయ‌నున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఫైన్ ప‌డిన త‌ర్వాత చెల్లించే విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే.. అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్నారు. ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో దాదాపు 30 ల‌క్ష‌ల వాహ‌నాలు ఉన్నాయి. కొత్త‌గా అమ‌లు చేయ‌నున్న కొత్త ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల కేసుల విష‌యంలో అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇంత భారీ మొత్తంలో ఫైన్లు విధించే నేప‌థ్యంలో పోలీసు అధికారుల‌తో వాహ‌న‌దారులు గొడ‌వ ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. దీంతో.. అలాంటి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు ఎక్స్ స‌ర్వీస్ మెన్లు.. అద‌న‌పు సెక్యురిటీ గార్డుల్ని నియ‌మించుకున్నారు. సినిమాల్లో చూసేందుకు బాగుండే ఈ భారీ జ‌రిమానాలు.. ప్రాక్టిక‌ల్ గా ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ ను తెచ్చి పెడ‌తాయ‌న్న‌ది తేలాలంటే మ‌రో రోజు వ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.