Begin typing your search above and press return to search.

పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలుతుంటే..స్కోరెంత‌? అన్న మంత్రి!

By:  Tupaki Desk   |   18 Jun 2019 4:29 AM GMT
పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలుతుంటే..స్కోరెంత‌? అన్న మంత్రి!
X
ఒకటి కాదు.. రెండు కాదు.. ప‌ది కూడా త‌క్కువే. వంద‌కు పైగా పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్న వేళ‌.. ఆరోగ్య‌శాఖామంత్రిగా వ్య‌వ‌హ‌రించే నేత ఎంత ఆందోళ‌న‌తో ఉండాలి? మ‌రెంత మ‌నోవ్య‌ధ‌తో ఉండాలి. మాయ‌దారి వ్యాధి త‌న రాష్ట్ర పిల్ల‌ల్ని చంపేస్తున్న వేళ‌.. ఆ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్టేందుకు ఎంత‌గా శ్ర‌మించాలి?

కానీ.. ఘ‌న‌త వ‌హించిన స‌ద‌రు మంత్రి పిల్ల‌లు చ‌నిపోయిన అంశంపై సాగిన రివ్యూ మీటింగ్ లో భార‌త్ -పాక్ మ్యాచ్ స్కోరెంత‌? అని అడిగిన తీరు.. నేత‌ల ద‌ళ‌స‌రి చ‌ర్మం ఎంత‌న్న విష‌యాన్ని చెప్పేస్తుంద‌ని చెప్పాలి. ఇలాంటి నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌టానికి మించిన పాపం.. నేరం మ‌రొక‌టి ఉండ‌దేమో?

ప్ర‌స్తుతం బిహార్ ను ఏఈఎస్ అనే వ్యాధి కుదిపేస్తుంది. అక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్ గా చెప్పే ఈ వ్యాధి మ‌హ‌మ్మారిలా వ్యాప్తి చెందుతూ పిల్ల‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టం.. చ‌నిపోవ‌టం జ‌రుగుతోంది. గ‌డిచిన 16 రోజుల్లో ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌.. దాని చుట్టుప‌క్క‌ల జిల్లాల్లో ఈ వ్యాధి కార‌ణంగా ఏకంగా వంది మందికి పైగా చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. ఈ వైర‌స్ బారిన ప‌డిన‌ పిల్ల‌లు అధిక జ్వ‌రం.. త‌ల‌నొప్పి ల‌క్ష‌ణాల‌తో చ‌నిపోతుంటారు.

ఇప్ప‌టికి ఆ రాష్ట్రంలో అనేక‌మంది చిన్నారులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. ఈ అంశంపై తాజాగా రివ్యూ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పిల్ల‌లు ఇంత పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణించిన అంశాన్నిసీరియ‌స్ గా తీసుకోవాల్సిన ఆరోగ్య శాఖామంత్రి మంగ‌ళ్ పాండే అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు.

ఈ రివ్యూ స‌మావేశం మ‌ధ్య‌లో స్కోర్ ఎంత‌? ఎన్ని వికెట్లు తీసార‌ని ప్ర‌శ్నించ‌టం చూస్తే.. ప్ర‌జ‌ల ప‌ట్ల నేత‌ల‌కు ఉండాల్సిన గౌర‌వాభిమానాలు.. వారి స‌మ‌స్యల ప‌ట్ల వారికున్న నిబ‌ద్ధ‌త ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మంత్రిగారి స్కోరెంత‌? అన్న మాట‌ల వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చి ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇలాంటి నేత‌ల్ని ఎన్నుకున్న పాపం.. ప్ర‌జ‌ల్ని వైర‌స్ ల రూపంలో వెంటాడుతుంద‌ని భావించాలా? ఇలా బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించే నేత‌ల విష‌యంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.