Begin typing your search above and press return to search.

బాబు మైండ్ సెట్ మారిందా? ఈసారి అన్నింట్లోనూ ముందే

By:  Tupaki Desk   |   25 March 2021 4:30 PM GMT
బాబు మైండ్ సెట్ మారిందా? ఈసారి అన్నింట్లోనూ ముందే
X
ఒక్కో అధినేతకు ఒక్కో స్టైల్ ఉంటుంది. తప్పు ఒప్పు అన్నది పక్కన పెడితే.. తమకు నష్టం జరుగుతుందన్న విషయం తెలిసినా ఆ తీరును మార్చుకోవటానికి ఇష్టపడరు. ఆ కోవలోకే వస్తారు టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ.. వారిని ప్రకటించే విషయంలోనూ ఆయన తరచూ తప్పులు చేస్తుంటారు.

అధికారంలో ఉన్నప్పుడు ఊపిరి సలపని బిజీ ఉంటుంది. అర్థం చేసుకోవచ్చు. కానీ.. విపక్షంలో ఉన్నప్పుడు కూడా చివరి క్షణం వరకు తర్జనభర్జనలు పడి టికెట్లను ఫైనల్ చేస్తుంటారు. అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావటం కూడా ఫలితాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న వేళ.. బాబు తన తీరును పూర్తిగా మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఆయన వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. తిరుపతి ఉప ఎన్నికలో మిగిలిన పార్టీల కంటే ముందే పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో దారుణ రీతిలో ఓటమి పాలైన వేళ.. అభ్యర్థి ఎంపిక ప్రక్రియను అదే పనిగా సాగదీయకుండా తేల్చేశారు. అంతేనా.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. తొలి నామినేషన్ ను వేయటం ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలు చూస్తుంటే.. బాబులో మార్పు మొదలైనందన్న మాట వినిపిస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న నమ్మకం లేనప్పటికీ.. అధికారపార్టీకి ధీటైప సమాధానం ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. దీనికి తగ్గట్లే.. ఇటీవల పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన బాబు.. తిరుపతి ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని.. కష్టపడి పని చేయాలన్నారు. ఒకవేళ.. అలా చేయని వారు ఉంటే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చేశారు.

ఓవైపు పార్టీ మనుగడపై చర్చ సాగుతున్న వేళ.. ఆ అంశాల్ని పట్టించుకోని బాబు.. తిరుపతి ఉప ఎన్నికల్లోతమ సత్తా చాటాలన్న యోచనలో ఉన్నారు. తిరుపతి అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ప్రకటిస్తే.. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా బరిలో దించారన్న మాట వైసీపీ నేతల నోటి నుంచి వచ్చాయి. అందులో నిజం ఎంతన్న విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన వారి కంటే ముందుగా ఆమె తన నామినేషన్ దాఖలు చేసి.. అధికార పార్టీకి సవాలు విసిరారు. నెల్లూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన పనబాక ఉత్సాహంగా కనిపించారు.

నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించకుండా భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించి మరీ వేశారు. ఈ కార్యక్రమంతో తెలుగుతమ్ముళ్లలో కొత్త జోష్ వచ్చిందని చెబుతున్నారు. మరీ ఉత్సాహం పోలింగ్ వరకు ఉంటుందా? ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.