Begin typing your search above and press return to search.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ సింగ్

By:  Tupaki Desk   |   14 Sep 2020 5:33 PM GMT
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా  హరివంశ్ సింగ్
X
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు. ఆయన ఈ స్థానానికి ఎన్నిక అవడం ఇది వరుసగా రెండో సారి. జేడీయూ పార్టీకి చెందిన హరివంశ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపాదించగా, థావర్ చంద్ సమర్థించారు. హరివంశ్ యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝాపై విజయం సాధించినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. మూజువాణి ఓటు ద్వారా హరివంశ్ సింగ్ ఎన్నిక అయ్యారు. 2018లో తొలిసారి ఈయన కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ ను ఓడించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ లో ముగిసింది.

రెండోసారి కూడా ఆయననే అభ్యర్థిగా నిలపాలని ఎన్టీఏ కూటమి నిర్ణయించింది. రాజ్యసభలో మొత్తం స్థానాల సంఖ్య 245 కాగా ఎన్డీఏ బలం 113 మాత్రమే కావడంతో హరివంశ్ కు మద్దతుకుగా జేడీయూ ఇతర పార్టీల మద్దతు కోరింది. ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వగా, తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ మాత్రం ఓటింగ్ లో పాల్గొన లేదు.
యూపీలో జన్మించిన హరివంశ్ అర్థశాస్త్రంలో పీజీ చేశారు. జర్నలిస్టుగా పనిచేశారు. 2014లో జేడీయూ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఆ పదవి కాలంలో ఉండగానే తొలిసారి రాజ్యసభ చైర్మన్ గా కూడా ఎన్నికయ్యారు.

డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన హరివంశ్ సింగ్ కు పలువురు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా హరివంశ్ ఎలా ఎంతోమందికి దగ్గర అయ్యారో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా రాణిస్తారని ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.