Begin typing your search above and press return to search.

బండి సంజయ్‌ కు హరీష్ రావు సంచలన లేఖ

By:  Tupaki Desk   |   1 Nov 2020 9:00 PM IST
బండి సంజయ్‌ కు  హరీష్ రావు సంచలన లేఖ
X
దుబ్బాక ఎన్నికల హీట్ ను మరింత పెంచుతూ మంత్రి హరీష్ రావు మరో సంచలన లేఖ రాశారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఇరుకునపెట్టారు. 18 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖతో బీజేపీని కడిగిపారేశారు.

దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ, మంత్రి హరీష్‌ రావు మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. మంత్రిని బీజేపీ టార్గెట్‌ చేయగా.. మంత్రి హరీష్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌‌ ఇస్తున్నారు. తాజాగా.. హరీష్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌‌కు 18 ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ లేఖలో మంత్రి హరీష్ రావు బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాగానే ఏడు మండలాలను ఆంధ్రాకు అప్పజెప్పింది బీజేపీ ప్రభుత్వం కాదా..? అతి తక్కువకు విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే లోయర్‌‌ సీలేరు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాన్ని ఎవరు అప్పగించారు..? విభజనం చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టకుండా మోసం చేయలేదా..? యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఐటీఐఆర్‌‌ ప్రాజెక్టులను బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకుంది..? కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీని రద్దుచేసింది బీజేపీ కాదా..? రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడిచినా తెలంగాణ న్యాయమైన నీటి పంపకాలు చేయకుండా అన్యాయం చేస్తోంది బీజేపీ కాదా..? ఆంధ్రాకు దేశంలోని అనేక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు..?

ఆదిలాబాద్‌లో గెలిస్తే సీసీఐని తిరిగి తెరుస్త అని అన్నారు. కానీ.. అక్కడ గెలిచి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు తెరవలేదని మంత్రి హరీష్ ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసినా.. కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు..? తెలంగాణకు మొత్తం రావాల్సిన రూ.12 వేల కోట్లు ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించడం లేదా..? అని హరీష్‌ ప్రశ్నించారు.

ఆంధ్రా విద్యుత్ ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని మంత్రి హరీష్ రావు లేఖలో ప్రశ్నించారు. తెలంగాణలో 39.5 లక్షల మందికి 2,016 రూపాయల పింఛన్‌ ఇస్తుంటే.. కేంద్రం ఎందుకు 6 లక్షల మందికి రూ.200 పెన్షన్ ఇస్తోంది..? దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలు కడుతుంటే.. అందులో తెలంగాణకు ఎందుకు అవకాశం లేదు..? వరంగల్‌ మామునూర్‌‌లో నిజాం హయాంలోనే విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయింది. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్‌ రంగ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ.. ప్యాకేజీలు ఇస్తున్న కేంద్రం వరంగల్‌లో నిర్మిస్తున్న దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు..? అని ప్రశ్నించారు.

మరి.. హరీష్‌ సంధించిన ఈ ప్రశ్నలకు బండి సంజయ్‌ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.