Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు హరీశ్ రావు సాధించాడు
By: Tupaki Desk | 28 July 2016 10:04 PM ISTప్రతిపక్షాలు వర్సెస్ అధికార పక్షం అన్నట్లుగా సాగిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. నిర్వాసితులు అయిన మొత్తం 8 గ్రామాల్లో 6 గ్రామాలు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభ్యంతరం వ్యక్తం అయిన రెండు గ్రామాల్లో ఒకటైన పల్లెపహాడ్ వాసులు అంగీకారం తెలిపారు. ఇక ఉత్కంఠ రేపిన సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి వాసులు సైతం ఎపిసోడ్ కు శుభం కార్డు వేసేందుకు అంగీకరించారు.
ఎర్రవల్లి గ్రామస్థులతో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఎర్రవల్లి గ్రామస్థులు మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. 123 జీవో ప్రకారం భూములు ఇచ్చేందుకు ఎర్రవల్లి ప్రజలు ఒప్పుకున్నారు. భూములు ఇస్తామంటూ హరీష్ రావుకు గ్రామస్థులు లిఖితపూర్వక పత్రం ఇచ్చారు. లిఖితపూర్వక పత్రంపై గ్రామస్థులు - రైతులు సంతకాలు చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ కు భూములు ఇచ్చిన రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. బంగారు తెలంగాణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు అండగా ఉంటామని ఎర్రవల్లి గ్రామప్రజలు స్పష్టం చేశారు.
