Begin typing your search above and press return to search.

పన్ను రాబడి, అప్పుల్లో ఏపీ స్థానమెంతో చెప్పిన హరీశ్ రావు

By:  Tupaki Desk   |   25 Aug 2021 12:30 AM GMT
పన్ను రాబడి, అప్పుల్లో ఏపీ స్థానమెంతో చెప్పిన హరీశ్ రావు
X
ఏపీ స్వీయ పన్నుల రాబడిపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వీయ పన్నుల రాబడిలో ఏపీ 5వ స్థానంలో ఉండగా, తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని హరీశ్‌ తెలిపారు. గత ఆరేళ్లలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీఎస్‌ డీపీ) వృద్ధిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని హరీశ్ అన్నారు. జీఎస్‌డీపీ భాగస్వామ్యంలో తెలంగాణ ఆరో అతిపెద్ద రాష్ట్రంగా ఉందని వెల్లడించారు.

2020-21కుగాను దేశంలోని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీయ పన్నుల రాబడిలో కేేంద్రం కన్నా ఏపీ ముందంజలో ఉందని వెల్లడించారు. 2014-15 మరియు 2020-21 మధ్యలో ఏపీ స్వీయ పన్నుల రాబడి వార్షిక వృద్ధి రేటు 8.38 శాతంతో 5వ స్థానంలో ఉండగా, కేంద్రం 8.10 శాతం మాత్రమే సాధించిందన్నారు. ఇక,తెలంగాణ 11.7 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా 9.74 శాతంతో జార్ఘండ్ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.

జీఎస్ డీపీలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో, దక్షిణాదిలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని హరీశ్‌ తెలిపారు. 2014-15లో రూ.5,05,849 కోట్లుగా ఉన్న జీఎస్ డీపీ.. 2020-21లో రూ.9,80,407 కోట్లకు చేరిందన్నారు. 2020-21లో దేశ జీడీపీకి భాగస్వామ్యం అందించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచిందన్నారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందని హరీశ్‌ స్పష్టం చేశారు.

జీఎస్ డీపీలో 25 శాతంలోపు అప్పులు తీసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందన్నారు. తెలంగాణ 22.8% అప్పు చేసిందని, ధనిక రాష్ట్రమైన పంజాబ్‌ 38%, వెస్ట్‌ బెంగాల్‌ 34.67%, రాజస్థాన్‌ 34.5%, ఉత్తరప్రదేశ్‌ 33%, ఏపీ 32.67% మేర అప్పులు తీసుకున్నాయని తెలిపారు. ఇందులోనూ ఏపీ 5వ స్థానంలో నిలిచిందని హరీశ్ వెల్లడించారు. ఆరేళ్లలో జాతీయ తలసరి ఆదాయం 48.7 శాతం పెరిగితే.. తెలంగాణలో ఏకంగా 91.5%(1.84 రెట్లు అధికం) పెరిగిందని వివరించారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఉందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే 11.5 శాతం వృద్ధితో అగ్ర స్థానంలో ఉందని తెలిపారు. 2014-15లో రూ.5,05,849 కోట్లుగా ఉన్న జీఎస్ డీపీ.. 2020-21లో రూ.9,80,407 కోట్లకు చేరిందన్నారు. ఈ ఆరేళ్లలో జీఎస్ డీపీ 93.8 శాతం పెరిగితే, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 58.4 శాతమే పెరిగిందని గుర్తు చేశారు. 2020-21లో దేశ జీడీపీకి భాగస్వామ్యం అందించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచిందన్నారు.