Begin typing your search above and press return to search.

త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు .. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   16 July 2020 12:10 PM GMT
త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు .. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
X
గత వంద రోజులకు పైగా విదేశీ విమాన సర్వీసులు నిలిచిపోయిన భారత్‌ లో మళ్లీ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయా.. అంటే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు లోనే మళ్లీ భారత్ నుంచి విదేశాలకు విమానాలు వెళ్లే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాటలని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న నిషేధం జులై 31 తో ముగిస్తే ఆగస్టు నుండి విమానాలు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ తో పూర్తిగా దేశంలో విమాన సర్వీసులని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇవ్వడంతో మే 25 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఎయిర్ బబూల్స్ కోసం కనీసం మూడు దేశాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఫ్రాన్స్, యుఎస్, జర్మనీతో చర్చలు కొనసాగుతున్నాయని, జులై 18- ఆగస్టు 1 మధ్య ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి పారిస్ ‌కు ఎయిర్‌ ఫ్రాన్స్ 28 విమానాలను నడనుందని తెలిపారు. ఎయిర్ బబూల్స్ ద్వారా ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ మందిని తరలిస్తామని వివరించారు. అయితే, ఇండియాలోలానే ఇతర దేశాల్లో కూడా కరోనా మహమ్మారి కారణంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి అని ,వీసా సహా కావాల్సిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక అనుమతి అవసరమని మంత్రి తెలిపారు. ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ అనేది రెండు దేశాల మధ్య ట్రావెల్ కారిడార్. దీనితో లాక్‌ డౌన్ కారణంగా మూసివేసిన సరిహద్దులను తిరిగి తెరిచి, ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్దరిస్తారు.

అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై జులై 31 వరకు నిషేధం విధిస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ ఇప్పటికే ప్రకటించింది. అప్పటి వరకూ భారత్ నుంచి ఇతర దేశాలకు, విదేశాల నుంచి భారత్ ‌కు ఎలాంటి విమాన ప్రయాణాలు ఉండవు అని స్పష్టం చేసింది. అయితే, అన్‌లాక్ 2.0లోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు దశలవారీగా తిరిగి ప్రారంభమవుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.