Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర లో ఫడ్నవీస్ సర్కార్ నిలబడుతుందా?

By:  Tupaki Desk   |   24 Nov 2019 5:07 AM GMT
మహారాష్ట్ర లో ఫడ్నవీస్ సర్కార్ నిలబడుతుందా?
X
అందరూ మేల్కొనేసరికే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిపోయింది. తెల్లవారితే సీఎం సీటు అని కలలుగన్న శివసేనకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. బీజేపీ కొట్టిన దెబ్బకు ఎన్సీపీ, కాంగ్రెస్ లు కుదేలయ్యాయి. ఎన్సీపీని చీల్చి మహారాష్ట్రలో బీజేపీ సర్కారు గద్దెనెక్కింది.

అయితే హీటెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు శనివారం అనూహ్య మలుపులు తిరిగాయి. బీజేపీకి జైకొట్టిన ఎన్సీపీ ఫిరాయింపు నేత అజిత్ పవార్ పై ఆపార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ వేటు వేశారు. అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో అసలు అజిత్ పవార్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలున్నారు..? మహారాష్ట్రలో బీజేపీ సర్కారు నిలబడుతుందా? లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఈనెల 30 న జరగబోతున్న బలనిరూపణలో ఎవరి బలాబలాలు ఏంటి అనేది ఆసక్తిగా మారింది.

*బీజేపీ 105 నాటౌట్.. మేజిక్ మార్క్ 145
మహారాష్ట్రలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లను గెలుచుకుంది. మేజిక్ మార్క్ 145గా ఉంది. ఇంకా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకి అవసరం. ఎన్సీపీ నుంచి ఫిరాయించిన అజిత్ పవార్ వెంట 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ఇక మహారాష్ట్రలో గెలిచిన కొందరు స్వతంత్రులు కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరారు.

*శరద్ రాజకీయం.. అజిత్ పవార్ ఒంటరి
ఎన్సీపీ ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీలో చేరిన అన్న కొడుకు అజిత్ పవార్ కు అధినేత శరద్ పవార్ షాకిచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేలను తిరిగి ఎన్సీపీలోకి తీసుకొచ్చారు. దీంతో బీజేపీ బలం దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం అజిత్ తో కలిపి ఫిరాయించిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు.

*బీజేపీకి ఇంకా 36మంది ఎమ్మెల్యేల అవసరం
మహారాష్ట్రలో ఓ ఫైన్ మార్నింగ్ బీజేపీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది కానీ సరిపడా బలం మాత్రం లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి 105, అజిత్ పవార్ తెచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 109మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇంకా 36 మంది ఎమ్మెల్యేలు అవసరం. శనివారం అలెర్ట్ అయిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలను క్యాంప్ నకు తరలించాయి. ఇప్పుడు చిన్న పార్టీలు, స్వతంత్రులపైనే బీజేపీ ఆశలు పెంచుకుంది.

*చిన్నపార్టీలు, స్వతంత్రుల బలమెంత?
మహారాష్ట్రలో చిన్న పార్టీల ఎమ్మెల్యేలు 16మంది గెలిచారు. స్వతంత్రులు 11 మంది ఉన్నారు. వీరందరినీ కలిపినా 27మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఇంకా బీజేపీకి 9 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ 27మందిలో ఇప్పటికే ఐదుగురు బీజేపీకి మద్దతు ఇవ్వమని ప్రకటించారు. దీంతో బీజేపీకి 14మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.. 14మంది ఉంటేనే బీజేపీ సర్కారు మహారాష్ట్రలో నిలబడుతుంది. ఎంఐఎం, ఎస్పీ, సీపీఎంలకు ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. వీరు స్వతహాగానే బీజేపీకి వ్యతిరేకులు. సో మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు.

* మెజార్టీకి 14మంది ఎమ్మెల్యేల దూరంలో బీజేపీ..
ఇండిపెండెంట్లు, చిన్నపార్టీలు, ఎన్సీపీ ఫిరాయింపు దారులను కలిపినా బీజేపీకి మేజిక్ మార్క్ 145కు చేరుకోలేకపోతోంది. కేవలం 131 ఎమ్మెల్యేలు మాత్రమే అవుతున్నారు ఇంకా 14 ఎమ్మెల్యేలు తక్కువ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సర్కారు మహారాష్ట్రలో నిలబడుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. కేంద్రంలోని మోడీషాలు మహారాష్ట్రలో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.