Begin typing your search above and press return to search.

వెంట్రుకలతో కోట్ల దందా..తెలుగు రాష్ట్రాలే టార్గెట్ , ఎందుకు

By:  Tupaki Desk   |   26 Aug 2021 1:02 PM IST
వెంట్రుకలతో కోట్ల దందా..తెలుగు రాష్ట్రాలే టార్గెట్ , ఎందుకు
X
దందా చేయడానికి ఏదీ అనర్హం కాదు. ఆఖరికి తలవెంట్రుకల ఎగుమతిలోనూ అవకతవకలు జరిగాయి. తలవెంట్రుకల దందాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. చైనా సహా పలు దేశాలకు ఫెమా నిబంధనలను ఉల్లంఘించి తల వెంట్రుకలు ఎగుమతి చేస్తున్న తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు వ్యాపారులపై ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ కొరడా ఝళిపించింది. హైదరాబాద్, తూర్పు గోదావరి జిల్లాలో 8 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆయా వ్యాపారులు లెక్కల్లో చూపని రూ. 2.90 కోట్ల నగదును జప్తు చేసింది.

అలాగే, వారి నుంచి 12 సెల్‌ఫోన్లు, మూడు లాప్‌టాప్‌లు, ఒక కంప్యూటర్, కొన్ని డైరీలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఈడీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో దక్షిణాది రాష్ట్రాల వారి తల వెంట్రుకలకు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఓ మూడు కంపెనీలు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు ఈడీ గుర్తించింది. హెయిర్ సెలూన్ల నుంచి సేకరించిన వెంట్రుకలను గోదాంకు తరలిస్తున్నట్టు ఈడీ తెలుసుకుంది. ఈ గోదాం అడ్రస్‌లతో నకిలీ వే బిల్లులు సృష్టించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. అసలు ఇంకా ఇలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి, ఈ దందా ఎంత కాలంగా కొనసాగుతోంది, అన్న అంశాలపై ఈడీ దృష్టి పెట్టింది.

తెలంగాణ, ఏపీకి చెందిన తల వెంట్రుకల ఎగుమతిదారులకు రూ. 16 కోట్ల మేర హవాలా చెల్లింపులు జరిగినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి వారిపై ఫెమా’నిబంధనల కింద దర్యాప్తు చేపట్టగా అక్రమ చైనీస్‌ యాప్‌ను ఉపయోగించి హైదరాబాద్‌ కు చెందిన ఇద్దరు వ్యాపారస్తులు ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులకు తల వెంట్రుకలు విక్రయించి పేటీఎం ద్వారా రూ. 3.38 కోట్లు ఆర్జించినట్టు గుర్తించామని ఈడీ వివరించింది. ఈ వ్యవహారంలో కొందరు మయన్మార్‌ జాతీయుల ప్రమేయాన్ని గుర్తించినట్లు తెలిపింది. హైదరాబాద్‌ లో తిష్ట వేసిన పలువురు మయన్మార్‌ జాతీయలు భారతీయ సంస్థల కోసం ఉద్దేశించిన ఇంపోర్ట్‌–ఎక్స్‌పోర్ట్‌ కోడ్‌ను వాడి తల వెంట్రుకల విలువను తక్కువగా చూపి వారి దేశానికి ఎగుమతి చేస్తున్నట్లు తేలిందని ఈడీ వివరించింది. మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా తదితర దేశాలకు తక్కువ పరిమాణంలో వెంట్రుకలను చూపి ఎక్కువ పరిమాణంలో వాటిని విక్రయించినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలినట్టు ఈడీ వెల్లడించింది.

హైదరాబాద్, కోల్‌ కతా, గువాహటికి చెందిన చాలా మంది వ్యాపారస్తులు విదేశీ వ్యాపారులకు వెంట్రుకలను ఎగుమతి చేస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మోరెహ్‌, జొఖాతర్‌, ఐజ్వాల్‌ గుండా మండాలె కు, అక్కడి నుంచి చైనాకు వెంట్రుకలను స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. భారత్‌ నుంచి స్మగ్లింగ్‌ చేసిన వెంట్రుకలను చైనీస్‌ వెంట్రుకలుగా అక్కడి వ్యాపారస్తులు పేర్కొని దిగుమతి సమయంలో 28 శాతం సుంకాన్ని ఎగ్గొట్టడంతోపాటు ఎగుమతి సమయంలో 8 శాతం రాయితీలను పొందుతున్నారు. చాలా మంది భారత వ్యాపారవేత్తలు సైతం వెంట్రుకల ఎగుమతి సమయంలో వాటి పరిమాణాన్ని తగ్గించి చూపి ఎగుమతి సుంకాన్ని ఎగ్గొట్టుతున్నట్టు ఈడీ గుర్తించింది. గతంలో ఎల్బీ నగర్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు జుట్టు వ్యాపారులకు ఓ యాప్‌ ద్వారా 20 కోట్ల రూపాయలు చేరినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం మొత్తంపై ఆరా తీసిన నిఘా సంస్థలు మయన్మార్‌ సరిహద్దుల్లో ఈ ఏడాది 53 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకీ మన తెలుగు రాష్ట్రాల వెంట్రుకలకు మాత్రమే ఎందుకంత డిమాండ్, ఇక్కడి నుంచే ఎక్కువగా హెయిర్ మాఫియా తన కార్యకలాపాలను సాగించడంలో అర్ధమేంటి? అంటే.. ఇక్కడే ఉంది అసలు నీలాల నిజం. బేసిగ్గా మన దగ్గర మాత్రమే తల నీలాలను మొక్కుబడిగా సమర్పించడం ఎక్కువ. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున వెంట్రుకల నిల్వ దొరుకుతుంది. ఇదే విగ్గుల వ్యాపారంలో మన జుట్టుకు భారీ డిమాండ్ ఏర్పడేలా చేసింది..

మరీ ముఖ్యంగా తలనీలాల నిల్వల్లో TTDయే టాప్. ఎందుకంటే ఇక్కడ తలనీలాల సమర్పణ అధికమొత్తంలో సాగుతుంది. కరోనా సీజన్ ను అలా ఉంచితే.. తిరుమలకు రోజూ 50 వేల మంది వరకూ భక్త జనం పోటెత్తుతుంటారు. వీరిలో ముప్పావు వంతు వరకూ తలనీలాలు సమర్పిస్తారు. దీంతో ఇక్కడ భారీ ఎత్తున నీలాల నిల్వ లభిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో TTD బోర్డు లెక్కల ప్రకారం ఒక్క కళ్యాణకట్ట ద్వారానే దాదాపు 130 కోట్ల రూపాయల రాబడి అంచనా వేశారు. ఇక 2019లో 74 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ప్రకటించింది TTD. ఇక 2006- 08 మధ్య అయితే అత్యధికంగా 250 కోట్ల రూపాయలను పొందగలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం.