Begin typing your search above and press return to search.

సుజనా టీడీపీవి వదిలి.. బీజేపీ విధానాలు పాటించు

By:  Tupaki Desk   |   17 Feb 2020 2:15 PM IST
సుజనా టీడీపీవి వదిలి.. బీజేపీ విధానాలు పాటించు
X
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి ఇంకా తెలుగుదేశం పార్టీ విధానాలు వదల్లేదని తెలుస్తోంది. అందుకే అతడిపై బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు ఘాటుగా స్పందించారు. సుజ‌నా చౌద‌రికి ప‌రోక్షంగా టీడీపీ విధానాల నుంచి బ‌య‌టికొచ్చి.. బీజేపీ ప‌ద్ధ‌తుల‌ను పాటించాల‌ని సూచించాడు. దీనికి రాజధాని విషయంలో జీవీఎల్ కు, సుజనాకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఆ సమయంలో సుజనా జీవీఎల్ ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. దీంతో జీవీఎల్ ఘాటుగానే స్పందించాడు.

రాజ‌ధాని విష‌యంలో జీవీఎల్ న‌ర‌సింహారావు, మీ మాట‌ల‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఎందుకని, కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోద‌ని జీవీఎల్ చెబుతుండగా, మీరేమో అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నార‌ని మీడియా ప్ర‌శ్నించగా సుజ‌నా స్పందిస్తూ తాను జీవీఎల్‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోన‌ని చెప్పాడు. ఆయ‌న‌కేమీ విశిష్ట అధికారాలు ఉంటాయ‌ని అనుకోన‌ని పేర్కొన్నాడు. ఒక రాజ్య‌స‌భ స‌భ్యుడిగా త‌న‌కెన్ని అధికారాలు ఉంటాయో, జీవీఎల్‌ కు కూడా అంతే ఉంటాయ‌ని, అయినా జీవీఎల్ ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ నుంచి ఎన్నికైన రాజ్య‌స‌భ స‌భ్యుడ‌ని, కాక‌పోతే ఆయ‌న ఆంధ్రా వ్య‌క్తి మాత్ర‌మే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విమర్శలపై ఇటీవల జీవీఎల్ స్పందించాడు. మండ‌లి ర‌ద్దు, మూడు రాజ‌ధానుల ఏర్పాటు లో మీరు చెబుతున్నంత స్ప‌ష్టంగా మీ పార్టీ నాయ‌కులు ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నారు? ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ఎందుకు మాట్లాడుతున్నార‌ని అదే మీడియా జీవీఎల్ ను ప్రశ్నించింది. దానికి ఆయన స్పందిస్తూ కొంత మంది విభ‌జ‌న చ‌ట్టంలో కొన్ని అంశాలున్నాయ‌ని, దాని ద్వారా కేంద్ర‌ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంటుంద‌ని, కొన్ని డిబేట్స్‌లో చెప్ప‌డం విన్నా. అలా చెప్పే వాళ్ల‌లో కొంద‌రు అధికార ప్ర‌తినిధులు కాదు. కొంత మందికి కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచ‌న‌ల ప‌ట్ల అవ‌గాహ‌న లేదని చెప్పారు. వారికి పార్టీ లైన్ ఏమిటో తెలియదు. నేను చెప్పేదే కేంద్ర పార్టీ, కేంద్ర ప్ర‌భుత్వ లైన్‌ అని స్పష్టం చేశారు. కొంత మంది తెలుగుదేశం నుంచి వ‌చ్చిన వారికి ఇంకా పాత వాస‌న‌లు పోలేదేమో... అది కూడా కొంత ఆస్కారం ఉంది. త‌ప్ప‌నిస‌రిగా, పూర్తిగా బీజేపీ చెప్పే విధానాల‌నే వాళ్లు న‌డుచుకోవాలని పరోక్షం గా సుజనా కు హెచ్చరించారు.

ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ విధానం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం నడుచుకోవాలని ఎంపీ సుజనాచౌదరికి సూచించారు. ఈ విధంగా ఒకే పార్టీలోని ఎంపీలు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుండడంతో ఈ వివాదం నెలకొంది. కొందరు కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకుంటుందని చెబుతుండగా, మరికొందరు కేంద్రం జోక్యం ఉండదు.. రాష్ట్రం ప్రకారమే అని చెబుతున్నారు. దీంతో జీవీఎల్, సుజనా చౌదరి మధ్య రాజధాని అంశం పై పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఇకనైన వారికి రాజధాని అంశంపై ఒక స్పష్టమైన స్టాండ్ వస్తుందో లేదో.