Begin typing your search above and press return to search.

గుత్తా జ్వాల ఫైర్‌..క‌విత మెడ‌కు చుట్టుకుంటోందా?

By:  Tupaki Desk   |   6 Aug 2018 5:25 PM GMT
గుత్తా జ్వాల ఫైర్‌..క‌విత మెడ‌కు చుట్టుకుంటోందా?
X

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. గ‌త కొద్దికాలంగా క్రీడ‌ల‌కు దూరంగా ఉంటున్న జ్వాల తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌తో వార్త‌ల్లో నిలిచారు. అదే తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేయ‌డం ద్వారా. గత కొద్ది సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ లోని రాజకీయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ ప్రస్తుతం అకాడమీని స్ధాపించాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వంతో ఆమె చ‌ర్చ‌లు జ‌రిపారు. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికి నెరవేరలేదని ట్విట్ట‌ర్ వేదికగా అసహనం తెలిపారు. కాగా, ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌ - నిజామాబాద్ ఎంపీ క‌విత వైపు ప‌లువురు చూపు ప‌డింది.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ కు గుత్తాజ్వాల దూరమై చాలా రోజులవుతుంది. దీంతో ఆమె బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది జూలైలో క్రీడల మంత్రి పద్మారావుని కలిసిన గుత్తాజ్వాల రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై అప్పట్లో చర్చించింది. ఈ మేర‌కు హామీ పొందింది. అయితే, ఈ విష‌యంలో ఎలాంటి ముంద‌డుగు ప‌డ‌క‌పోవ‌డంతో....తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా జ్వాల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నాలుగేళ్లు గడిచిన ఇప్పటి వరకు స్థలం ఇవ్వలేదని - ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ - సీఎంవో కార్యాలయానికి జ్వాలా ట్వీట్ చేశారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద ఇంటి స్థలాన్ని ప్రకటించిందని, ప్రభుత్వమే హామీని ఇచ్చిందని గుత్తా జ్వాలా ఆవేదన వ్యక్తం చేశారు. త‌ను త‌ప్ప మిగ‌తా క్రీడాకారులంతా వాటిని పొందార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

కాగా, దాదాపు మూడేళ్ల క్రితం గుత్తా జ్వాల టీఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రైతులు ఆత్మహత్య చేసుకున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్‌ ఎంపీ కవిత వారికి స‌హాయం అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, వారి కుటుంబాలకు చేయూతనివ్వాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా గుత్తా జ్వాల - సానియా మీర్జా తల్లి - ప్రజ్ఞాస్‌ ఓజాతో కలిసి తెలంగాణ భవన్‌ లో కవిత విలేకరులతో మాట్లాడారు. రైతు కుటుంబాలను ఆదుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గుత్తా జ్వాల - ఓజాలు ప్రకటించారు. గుత్తాజ్వాల లక్ష రూపాయలు - సానియా మీర్జా తరపున ఆమె తల్లి మూడు లక్షలు - ప్రజ్ఞాస్‌ ఓజా 2 లక్షల చెక్కులను అందించారు. వారిని ఎంపీ క‌విత అభినందించారు. సాక్షాత్తు పార్టీ కార్యాల‌యం వేదిక‌గా ముఖ్య‌మంత్రి కూతురు - ఎంపీ క‌విత అభినందించిన గుత్తా జ్వాల‌కు ఇలా నిరాశ ఎదుర‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.