Begin typing your search above and press return to search.

మూడో వేవ్ పై టెన్షన్ తీరేలా గులేరియా కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   1 July 2021 4:34 AM GMT
మూడో వేవ్ పై టెన్షన్ తీరేలా గులేరియా కీలక వ్యాఖ్యలు
X
ఒకటి.. రెండు వేవ్ లు ముగిసాయి. మూడో వేవ్ ఎప్పుడు ముంచుకొస్తుందో..? అప్పుడేం జరుగుతుందో? అన్న ఆందోళన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మొదటి వేవ్ ను విజయవంతంగా అధిగమించామన్న సంతోషాన్ని సెకండ్ వేవ్ షాకివ్వటమే కాదు.. జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాల్ని ఎన్నింటినో మిగిల్చింది. దేశంలోని ప్రతి ఒక్కరు కరోనా సెకండ్ వేవ్ లో.. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని ప్రభావానికి గురి కావటమే కాదు.. విషాదాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

దీంతో.. మూడో వేవ్ మీద విపరీతమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చే తల తోక లేని వ్యాఖ్యలు.. శాస్త్రీయం లేని వాదనలతో మరింత టెన్షన్ కు గురవుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రియాక్టు అయ్యింది. మూడో వేవ్ గురించి ప్రజలు అట్టే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

మూడో వేవ్ లో కొద్దిపాటి లక్షణాలతో కొవిడ్ సోకితే.. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే తగ్గిపోతుందని.. పిల్లల ఆరోగ్యం విషయంలో అనవసరమైన ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని మరెవరో చెబితే సందేహించాల్సిందే కానీ.. చెప్పింది ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా. కాకుంటే ఇతర వ్యాదులతో ఇబ్బంది పడే కొమార్బిటీస్ పిల్లలు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారుల విషయంలో మాత్రం కాస్తంత కేర్ ఫుల్ గా ఉండాలని చెప్పారు.

మూడో వేవ్ లో చాలామంది పిల్లల్లో కొవిడ్ వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చని.. అందువల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉండదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సైతం అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా టెన్షన్ పుట్టిస్తున్న మూడోవేవ్ మీద వినిపిస్తున్న తాజా వ్యాఖ్యలు భయాన్ని పోగొట్టి.. కొత్త అభయంగా మారాయని చెప్పక తప్పదు.