Begin typing your search above and press return to search.

గ్రెటా టూల్ కిట్ః ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు!

By:  Tupaki Desk   |   17 Feb 2021 6:00 AM IST
గ్రెటా టూల్ కిట్ః ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు!
X
రైతులకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌‌ ఓ టూల్‌కిట్‌ను షేర్‌ చేశారు. ఈ టూల్‌కిట్‌ వెనుక తజకిస్తాన్‌ ఉగ్రవాదులు ఉన్నారనేది ఢిల్లీ పోలీసుల అనుమానం. ఈ టూల్ కిట్ తో సంబంధం ఉందంటూ తొలుత ఓ యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ త‌ర్వాత మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో.. ఈ విష‌యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆదివారం బెంగళూరుకు చెందిన యువ యాక్టివిస్ట్‌ దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయగా.. 24 గంటలు గడవకముందే శాంతాను, నికితాలపై ఢిల్లీ హైకోర్టు నాన్‌బెయిల్‌వారెట్‌ జారీచేసింది. దీంతో.. ఢిల్లీ పోలీసులు నికితను అరెస్ట్‌ చేయగా.. శాంతాను పరారీలో ఉన్నట్లు స‌మాచారం. కాగా.. త‌న‌కు అరెస్ట్ నుంచి నాలుగు వారాల స‌మ‌యం ఇవ్వాల‌ని కోరుతూ నికితా బాంబే హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా.. రిపబ్లిక్‌ డే నాడు ఢిల్లీలో చోటుచేసుకున్న హింస ఘటనలో ఈ ముగ్గురు యువతుల పాత్రపై ఢిల్లీ పోలీసులు ప‌లు వివరాలు వెల్లడించారు. జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనతో దిశరవి, శాంతాను, నికితా జాకబ్‌కు ప్రత్యక్షంగా సంబంధముందని భావిస్తున్నామని, దీనికి సంబంధించిన పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కెనడాకు చెందిన చెందిన ఓ యువతి అందించిన సలహాలు, సూచనల ఆధారంగా వీరు సోషల్‌ మీడియాలో టూల్‌కిట్‌ను షేర్‌ చేశారని, ఆ టూల్‌కిట్‌ను టెలిగ్రామ్‌ ద్వారా గ్రెటా వీరికి షేర్‌ చేశారని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా.. జనవరి 11న వీరంతా జూమ్‌ యాప్‌ద్వారా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. కాగా.. ఈ టూల్‌కిట్‌ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు గ్రెటా థన్ బర్గ్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ అరెస్టులపై దేశవ్యాప్తంగా విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్‌ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

ఇదిలాఉండగా.. ఈ విషయంలో పాకిస్థాన్ స్పందించడం గమనార్హం. భారత్‌లో సామాజిక కార్యకర్తల అరెస్ట్‌పై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రీ‌క్ ఈ‌‌ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. 'సామాజిక ఉద్యమకారిణి దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రంలోని మోదీ సర్కార్‌ పౌరుల హక్కులను కాలరాస్తోంది. కశ్మీర్‌ విభజనతో మైనార్టీలను తన గుప్పిట్లోకి తీసుకుంది.

దేశంలో క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది.' అంటూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. 'ఇండియా హైజాక్‌ ట్విటర్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌తో జతచేసింది. అంతేకాదు.. దిశరవికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని కూడా పాక్ ప్రకటించింది.