Begin typing your search above and press return to search.

అమెరికా డాక్ట‌ర్ల కంటే మ‌న తెలుగు డాక్ట‌ర్లే గ్రేట్‌

By:  Tupaki Desk   |   11 Dec 2021 5:12 PM IST
అమెరికా డాక్ట‌ర్ల కంటే మ‌న తెలుగు డాక్ట‌ర్లే గ్రేట్‌
X
భారతదేశం ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతూ సరి కొత్త పుంతలు తొక్కే ఆలోచనలతో ప్రపంచానికే సరికొత్త సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచానికి అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలోనే నిర్ధారణ కాని... ఒక అరుదైన ఈ వ్యాధిని ఇపుడు మన దేశంలో నిర్ధారించారు. అది కూడా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆ వ్యాధి నిర్దారించి విజయం సాధించారు. గతంలో మన తెలుగువారైన డాక్టర్ నాయుడమ్మ శ‌స్త్ర చికిత్సల ద్వారా అవిభక్త కవలలను విడదీసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశారు.

ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి విభాగం వైద్యులు మరో సరికొత్త సంచలనానికి తెరతీశారు. గుంటూరుకు చెందిన 25 ఏళ్ల యువకుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం అతడి కాళ్లు చేతులు చచ్చుప‌డిపోయి నడవలేని స్థితికి వచ్చేశాడు. అమెరికాలో ఎన్నో పరీక్షలు చేసినా... అక్కడ ఆ వ్యాధి నిర్ధారణకు రాలేదు. దీంతో అతడు అమెరికా నుంచి గుంటూరుకు వచ్చేసాడు. ఈ క్రమంలోనే అతను వ్యాధిని న్యూరాల‌జీ విభాగాధిపతి ఆచార్య ఎన్‌వి. సుందరాచారి, సహచర వైద్యబృందం శాస్త్రీయంగా నిర్ధారించింది.

అతడు పాలియో సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ వ్యాధి దాదాపు బ్లడ్ క్యాన్సర్ ను పోలి ఉంటుందని చెప్పారు. క‌రోనా కారణంగా రెండేళ్ల నుంచి బయటకు రాకపోవడంతో బాధితుడు తన కాళ్లు ప‌ట్టేసి ఉన్నాయ‌ని... ముందు నుంచి అపోహ పడ్డాడు. అయితే కొద్ది రోజులుగా పరిస్థితుల్లో మార్పు రావడంతో పాటు... కూర్చుంటే లేవలేక పోవడం... లేస్తే కూర్చోలేక పోవడం లాంటి సమస్యలతో అతడు అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరాడు.

అక్కడ అతడి వ్యాధిని నిర్ధారించేందుకు ఎన్నో పరీక్షలు చేసిన ఏం వ్యాధి అన్నది తేలలేదు. అయితే అమెరికా వైద్యులు ఆ వ్యాధిని అంచనా వేయలేక వెన్నెముకలో ఇన్ఫెక్షన్ ఉంద‌ని అబద్ధపు రిపోర్టు ఇచ్చారు. అయితే జీజీహెచ్ వైద్యులు అత‌డిని వారం రోజుల పాటు ఇన్‌పేషెంట్‌గా ఉంచుకుని అత‌డి ప్ర‌తి క‌ద‌లిక గుర్తించారు. ప్లాస్మా సెల్స్ నుంచి మైలోమా ప్రొటీన్ ఏకంగా 10 శాతం ఉత్ప‌త్తి అవుతోన్న ( వాస్త‌వంగా ఒక శాత‌మే రావాలి) విష‌యం గుర్తించారు. ఇది బ్ల‌డ్ క్యాన్స‌ర్‌కు సంకేతంగా గుర్తించారు. దీనిని కిమో థెర‌పీ, మూల‌గ‌ల శ‌స్త్ర‌చికిత్స ద్వారా మాత్ర‌మే త‌గ్గించ‌వ‌చ్చ‌ని నిర్దారించారు.

ఇది ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందిలో ఒక‌రో ఇద్ద‌రికి మాత్ర‌మే వ‌స్తుంద‌ని.. త‌మ 25 ఏళ్ల స‌ర్వీసులో ఈ కేసు తొలిసారిగా చూశామ‌ని వైద్యులు చెప్పారు. అయితే అమెరికా వైద్యులు చేసిన పరీక్ష‌లు బాగున్నా.. వారు ఏ వ్యాధి అన్న‌ది నిర్దారించ‌లేక‌పోయార‌ని జీజీహెచ్ వైద్యులు చెప్పారు.