Begin typing your search above and press return to search.

ట్రంప్ కు గొప్ప ఊరట.. కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 Feb 2021 11:30 AM IST
ట్రంప్ కు గొప్ప ఊరట.. కీలక వ్యాఖ్యలు
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గొప్ప ఊరట లభించింది. ఆయన మరోసారి అభిశంసన నుంచి బయటపడ్డారు. రెండో అభిశంసన విచారణలో భాగంగా సెనేట్ లో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా.. అందులో ట్రంప్ గట్టెక్కారు.

ట్రంప్ పై అభిశంసన తీర్మానం నెగ్గేందుకు సెనేట్ లో మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు అవసరం. కానీ ఆ బలం లేకపోవడంతో ఆయనపై అభియోగాలు వీగిపోయాయి.

సెనేట్ లో మొత్తం 100 మంది సభ్యులు ఉండగా.. ట్రంప్ పై పెట్టిన అభిశంసనకు అనుకూలంగా 57మంది.. వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. దీంతో అభిశంసన నుంచి ట్రంప్ బయటపడినట్లైంది. అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా ఏడుగురు రిపబ్లికన్లు ఓటు వేయడం విశేషం.

ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా చివరిరోజుల్లో జోబైడెన్ ఎన్నికను ధ్రువపరిచే సమావేశం అమెరికా క్యాపిటల్ పై జరిగింది. జనవరి 6న ఆయన తన మద్దతుదారులను రెచ్చగొట్టి దానిపై దాడి చేయించాడు. దీనికి ట్రంపే కారణమని ఆరోపణలున్నాయి. దీంతో ట్రంప్ పై అమెరికన్ కాంగ్రెస్ లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా అది తాజాగా వీగిపోయింది.

సెనేట్ చివరకు ట్రంప్ ను నిర్దోషిగా తెలుపడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే అసలు రాజకీయ ఉద్యమం ప్రారంభమైందన్నారు. అమెరికా గ్రేట్ ఎగైన్ కోసం చారిత్రాత్మక, దేశభక్తితో కూడిన అందమైన ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే మరో అధ్యాయమని పేర్కొన్నారు.

'మన ముందు ఇంకా చాలా పని ఉంది. త్వరలో మనం ప్రకాశవంతమైన, అపరిమితమైన అమెరికన్ భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమం ద్వారా మళ్లీ కలుద్దాం.' అని ట్రంప్ అన్నారు. సత్యాన్ని, న్యాయాన్ని సమర్ధిస్తూ తనకోసం పనిచేసిన లాయర్లకు ఈ సందర్భంగా ట్రంప్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.