Begin typing your search above and press return to search.

పోలవరానికి ఈ ముష్టి ఏంది మోడీ..?

By:  Tupaki Desk   |   1 March 2016 11:30 AM GMT
పోలవరానికి ఈ ముష్టి ఏంది మోడీ..?
X
హామీలు ఇచ్చి వదిలేయటం రాజకీయ పార్టీలకు అలవాటే. సాక్ష్యాత్తు భారత ప్రభుత్వం పార్లమెంటులో హామీ ఇచ్చిన తర్వాత అమలు కాకపోవటం ఏమిటి? ఎన్నికల వేళ హామీలు ఇచ్చి వదిలేసిన చందంగా మోడీ సర్కారు వ్యవహరించటంపై ఆంధ్రులు కస్సుమంటున్నారు. ఇష్టారాజ్యంగా విభజన చేయటం.. ఈ సందర్భంగా ఏపీకి జరిగే నష్టాన్ని తాము సరిదిద్దుతామంటూ నాటి కేంద్రసర్కారు స్పష్టం చేయటంతో పాటు.. పలు తాయిలాల్ని ప్రకటించారు. కేంద్రం నాటి తాయిలాల్ని చూసి.. అప్పటి విపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు చెలరేగిపోతూ.. ‘‘త్వరలో మేం పవర్ లోకి వస్తున్నాం.. మేం చూసుకుంటాం. మీకంటే డబుల్ ప్యాకేజీలు ఇస్తాం’’ అంటూ గొప్పలు చెప్పినప్పుడు సీమాంధ్రులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

ఇక.. ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించినప్పుడు బీజేపీ వాళ్ల కంటే ఎక్కువగా ఆనందించింది సీమాంధ్రులే. కోటి ఆశలతో.. విభజన కారణంగా జరిగిన నష్టాన్ని మోడీ సర్కారు భర్తీ చేస్తుందని ఆశించినా.. ఫలితం మాత్రం శూన్యమేనని తాజాగా మరోజాసారి తేలింది. దాదాపు రూ.16వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేస్తామని.. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా యూపీఏ సర్కారు ప్రకటించింది.

అయితే.. అందుకు భిన్నంగా మోడీ సర్కారు వ్యవహరిస్తోంది. రూ.16వేల కోట్ల ప్రాజెక్టుకు మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించగా.. రెండో బడ్జెట్ లో రూ.100 కోట్లు.. తాజాగా మూడోసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్లోనూ పోలవరం ప్రాజెక్టుకు రూ.100కోట్లు మాత్రమే కేటాయించటం చూసినప్పుడు.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందన్నసందేహం కలగటం ఖాయం..

మూడు బడ్జెట్లు పూర్తి అయిన నేపథ్యంలో మోడీ సర్కారు ప్రవేశ పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లు మరో రెండు మాత్రమే. చివరి బడ్జెట్ ఎన్నికలకు తగ్గట్లు ఉండే వీలు ఉండటంతో.. మిగిలిన ఒక్క బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టు మీద కేంద్రం ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శించే అవకాశం తక్కువే. అంటే.. నాలుగైదేళ్లలో పూర్తి చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆశ నెరవేరే అవకాశమే లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కావటం సంగతి తర్వాత.. అసలెప్పటకి పూర్తి అవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. అయినా.. పావలా.. పది పైసలు అన్నట్లుగా బిచ్చం వేస్తున్న మోడీ తీరు చూసినప్పుడు.. ఆ మాత్రం చిల్లర వేయకుంటే మాత్రం ఏమవుతుందని సీమాంధ్రులు మండి పడుతున్నారు.