Begin typing your search above and press return to search.

నల్లకుబేరులకు మోడీ లాస్ట్ ఛాన్స్..?

By:  Tupaki Desk   |   25 Nov 2016 5:44 AM GMT
నల్లకుబేరులకు మోడీ లాస్ట్ ఛాన్స్..?
X
నల్లధనంపై పోరు మొదలెట్టిన ప్రధాని మోడీ నల్లకుబేరులకు ముచ్చమటలు పోయిస్తున్న వైనం తెలిసిందే. ఎవరూ ఊహించనిరీతిలో పెద్దనోట్ల రద్దుపై తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లకుబేరులు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. రద్దునేపథ్యంలో తమ వద్ద ఉన్ననల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు కిందా మీదా పడుతున్న నల్ల దొరలు మోడీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నిర్ణయంతో తమ దగ్గరున్న నల్లధనాన్ని ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు మార్గాల్లో నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే ప్రయత్నాలు చేసినా.. ఎక్కడో ఒక చోట దొరికిపోతామన్న భయం వారిని పట్టి పీడిస్తోంది.

తమ లాంటి వారికి చివరగా ఒకేఒక్క ఛాన్స్ కానీ మోడీ ఇస్తే బాగుండన్నమాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నల్లదొరలకు కాసింత ఉపశమనం కలిగించేలా కేంద్రం ఆసక్తికర నిర్ణయం తీసుకుంటుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రద్దు దెబ్బ కారనంగా భారీగా నష్టపోయిన నల్లదొరలకు కూసింత ఉపశమనం కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

బ్యాంకుల్లో రూ.2.5లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసి.. దానికి సంబంధించిన లెక్కలు సరిగా చూపని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. లెక్క చూపని సొమ్ములపై 90 శాతం వరకూ పన్ను విధించటం.. ప్రాసిక్యూషన్ చేయాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇవన్నీ అనధికారిక సమాచారమేనన్నవిషయాన్ని మార్చిపోకూడదు.

కేంద్రం తీసుకుందని చెబుతున్న నిర్ణయాలతో బెంబేలెత్తిపోతున్న నల్లదొరలకు చిట్టచివరగా ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయం ప్రభుత్వాధినేతల్లో ఉందని.. దీనిపై వారిలో వారికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. ఇంతకూ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్న తాజా మినహాయింపువిషయానికి వస్తే.. నల్ల కుబేరులు తాము దాచుకున్న నల్లధనాన్ని స్వచ్ఛందంగా ప్రకటిస్తే.. వారు లెక్క చూపని మొత్తంపై 60 శాతం పన్ను వేసి సరిపెట్టాలని.. భారీగా నష్టపోయే వారికి ఎంతోకొంత మేలు చేశామన్న భావన కలిగేలా చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ సమాచారం అనధికారికం మాత్రమే తప్పించి.. అధికారికం కాదు.

గురువారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందన్న ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. అంతేకాదు.. ఎప్పటి మాదిరి మంత్రివర్గ నిర్ణయాల్ని కూడా ప్రకటించకపోవటం గమనార్హం. ఇప్పటివరకూ నల్లకుబేరులపై వరుసగా చర్నాకోలు విసిరిన మోడీ సర్కారు.. ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. మోడీ ఆ తరహా నిర్ణయాన్ని తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/