Begin typing your search above and press return to search.

క‌దులుతారా.. క‌త్తిదూయ‌మంటారా: ట్రెజ‌రీ ఉద్యోగుల‌కు స‌ర్కారు వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   30 Jan 2022 1:30 AM GMT
క‌దులుతారా.. క‌త్తిదూయ‌మంటారా:  ట్రెజ‌రీ ఉద్యోగుల‌కు స‌ర్కారు వార్నింగ్‌!
X
ఏపీలో ఉద్యోగుల‌కు, స‌ర్కారు మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం.. ఇప్పుడు చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేసింది. ముఖ్యంగా జ‌న‌వ‌రి నెల జీతాల‌కు సంబంధించి బిల్లుల‌ను ప్రాసెస్ చేసేది లేద‌ని.. భీష్మించిన ట్రెజ‌రీ ఉద్యోగుల‌పై స‌ర్కారు చ‌ర్య‌లకు సిద్ధ‌మైంది. క‌దులుతారా.. క‌త్తిదూయ‌మంటారా..? అని వార్నింగ్ ఇచ్చింది. కొత్త పే స్కేళ్ల ప్రకారం తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

శ‌నివారం సాయంత్రం 6 గంటల వరకు బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ.. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మోమోలు జారీ చేశారు. కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల చెల్లింపు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పీఆర్సీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు హెచ్చరిం చారు. ఫిట్‌మెంట్‌ ఇంత తగ్గిస్తారనుకోలేదన్నారు. హెచ్‌ఆర్‌ఏలోనూ అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు.

ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షల్లో బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరుతున్నామన్నారు. పన్నెండు సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి అన్నిసంఘాలు మద్దతిస్తున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిపై మాట తప్పారని ఆరోపించారు. మరోవైపు పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంత‌లోనే.. స‌ర్కారు చ‌ర్య‌ల‌కు సిద్ధం కావ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.