Begin typing your search above and press return to search.

ఇండియా మీద పాక్ ఎందుకు ఓడిపోతుంది?

By:  Tupaki Desk   |   25 March 2016 7:23 AM GMT
ఇండియా మీద పాక్ ఎందుకు ఓడిపోతుంది?
X
ఇండియా - పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు ఎంత సంబరమో తెలియంది కాదు. పాకిస్థాన్ పై ఇండియాదే ఎప్పుడూ పైచేయి. అంతేకాదు... భారత్ - పాక్ అటగాళ్లు - అభిమానుల మధ్య కూడా ఎంతో తేడా ఉంటుంది. రచయిత - నటుడు - విమర్శకుడు గొల్లపూడి మారుతీరావు భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ ల గురించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.

టీ20యా - వన్డేనా - టెస్టు మ్యాచా అన్న తేడా లేకుండా.... ఇండియాయా - ఇంగ్లండా - పాకిస్థానా అన్న వేదిక వ్యత్యాసాలు లేకుండా ఎక్కడ ఆడినా కూడా అభిమానుల్లో ఉత్సాహం - ఉత్కంఠ - ఉద్రిక్తతలు అన్నీ ఉంటాయి. ఆటగాళ్లు మైదనాంలో స్పందించే తీరు కూడా అభిమానులను ప్రభావితం చేస్తుంది. మైదానంలో ఆటగాళ్లు రెచ్చిపోతే చూస్తున్న అభిమానులు కూడా అంతకుమించి రెచ్చిపోతుంటారు. ఈ విషయంలో భారత ఆటగాళ్లను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు గొల్లపూడి - మన ఆటగాళ్లు చాలా కూల్ గా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇటీవలి మ్యాచ్ లో రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఉమర్ అక్మల్ క్యాచ్ ను ధోనీ పట్టిన సందర్భాన్ని గొల్లపూడి విశ్లేషించారు. అక్మల్ ను అవుట్ చేసిన అనంతరం జడేజా - ధోనీలు ఒకరినొకరు చాలా కేజువల్ గా అభినందించుకుని ఊరుకున్నారని... కానీ, శిఖర్ ధావన్ ను అవుట్ చేసినప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం తెగ రెచ్చిపోయారు.

అలాగే ధోనీ - కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ ఫోర్ కొడితే ధోనీ జస్టు కోహ్లీ భుజంపై తట్టి అభినందించారు. కానీ, అఫ్రిది - ఇతర పాక్ ఆటగాళ్లు మాత్రం వికెట్ తీసినా, షాట్ కొట్టినా కూడా మామూలుగా స్పందించలేదు. ఇండియన్ ఆటగాళ్లు మ్యాచ్ ను మ్యాచ్ లా చూస్తే పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం యుద్ధంలా చూస్తున్నారు. ఆ యాటిట్యూడ్ తోనే వారు ఓటమి చెందుతున్నారని గొల్లపూడి విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్ - అబ్దుల్ ఖాదిర్ వంటివారు ఆటకు గౌరవం తెస్తే మియాందాద్ వంటివారు భ్రష్ఠు పట్టించారంటున్నారు.