Begin typing your search above and press return to search.

ఆక్షన్ అరుదైన గోల్కొండ వజ్రం .. భారత్‌ కి నిజాం వారసుల విజ్ఞప్తి !

By:  Tupaki Desk   |   18 Feb 2021 7:00 AM IST
ఆక్షన్ అరుదైన గోల్కొండ వజ్రం .. భారత్‌ కి నిజాం వారసుల విజ్ఞప్తి !
X
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్కొండ లో లభించిన అపురూపమైన, అరుదైన వజ్రం వేలానికి సిద్దమైంది. న్యూయార్క్ ‌‌లోని ఫార్చనా ఆక్షన్‌ హౌస్‌ లో ఈ వజ్రాన్ని వేలం వేస్తున్నారు. 3.05 క్యారెట్ల వజ్రం కోటిన్నర రూపాయలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ వజ్రాన్ని భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిజాం వారసులు కోరుకుంటున్నారు. కుతాబ్ షాహి కాలంలో గోల్కొండ నుండి తవ్విన నిజాం శకం వజ్రాలను, అనేక విలువైన కళాఖండాలు న్యూయార్క్ ‌లోని ఫార్చనా ఆక్షన్‌ హౌస్‌ వద్ద వేలం వేయనున్నారు. గోల్కొండ డైమండ్స్ అని పిలువబడే వజ్రాలు మచ్చలేని విలువైన రాళ్లను వేలంపాటదారుల కోసం ప్రదర్శిస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.

ఈ డైమండ్‌ విలువ లక్షా 50 వేల నుంచి రెండు లక్షల డాలర్లు పలికే అవకాశముంది. గోల్కొండ నవాబులకు 23 వజ్రాల గనులు ఉండేవి. గోల్కొండలో లభించిన వజ్రాలను కొనడానికి అప్పట్లో బ్రిటీష్‌, డచ్‌ ‌వర్తకులు ఆశపడ్డారు. ఈ డైమండ్‌రింగ్‌ వేలం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వజ్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ డైమండ్‌లో నైట్రోజన్‌ ఉనికి ఉండదు.. పసుపు రంగులో మెరిసిపోతుంటాయి.

ఫార్చునా ఆక్షన్‌ హౌస్‌ లో ఇలాంటి డైమండ్స్‌ కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. దక్కన్‌ సాంప్రదాయాన్ని ప్రతిబింబిందే ఈ వజ్రాలు చాలా ఏళ్ల క్రితమై హైదరాబాద్ ‌ను, భారత్ ‌ను దాటాయి. విదేశీ మ్యూజియంలో ఉన్న ఈ వజ్రాన్ని ఇప్పడు వేలం వేస్తున్నారు. 200 ఏళ్ల క్రితమే గోల్కోండ వజ్రం గనులను మూసేశారు. అయినప్పటికి అలనాటి వజ్రాల విలువ పెరిగిందే కాని తగ్గలేదు. ఇలాంటి అపురూప సంపదను భారత్‌కు తీసుకురావాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు, నిజాం వారసులు కోరుతున్నారు.

దేశానికి చెందిన అపరూపమైన సంపద విదేశాలకు తరలిపోతోందని రాయల్టీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎస్టేట్స్‌ ప్రతినిధి నవాబ్‌ షఫాత్‌ అలీఖాన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండ వైభవాన్ని భావితరాలకు వివరించేందుకే భారతదేశం వేలంలొ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని మనం సొంత చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.