Begin typing your search above and press return to search.

ప్రపంచం దృష్టికి గోదావరి పుష్కరాలు

By:  Tupaki Desk   |   25 Jun 2015 9:17 AM GMT
ప్రపంచం దృష్టికి గోదావరి పుష్కరాలు
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోదావరి పుష్కరాలకు ఈసారి ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించబోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మూడు దశల్లో ప్రచారం చేస్తారు. తొలుత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామగ్రామాన ప్రచారం చేయడం... ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం చేస్తారు. అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో.. అన్ని చానళ్లలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. దీనికోసం డాక్యుమెంటరీలు, షార్టుఫిల్ములు వంటివి రూపొందించారు. ఒకలోగో, ప్రత్యేక నేపథ్యం గీతం కూడా సిద్ధం చేశారు. ఇతరదేశాల్లోనూ తెలిసేలా... యూట్యూబ్ , ఫేస్ బుక్, వాట్స్ యాప్, ట్విట్టర్ లోనూ విస్తృత ప్రచారం చేయబోతున్నారు. ఇవన్నీ కాకుండా అంతర్జాతీయ పేరున్న ప్రముఖ నాలెడ్జి చానెల్ నేషనల్ జియోగ్రఫిక్ చానల్ లో పుష్కరాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారం చేయబోతున్నారు.

తెలుగు సంస్కృతి, వైభవం.. గోదావరి గొప్పదనం.. పుష్కర ప్రాముఖ్యత వంటివన్నీ ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు ఏపీ సర్కారు. గట్టి చర్యలు తీసుకుంటోంది. పుష్కరాలు జరిగే పన్నెండు రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర గోదావరి నీటిని దేశంలోని అన్ని నదుల్లో కలిపేందుకూ ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లో పుష్కరాలపై డాక్యుమెంటరీ ప్రసారమైతే భారత్, ఆంధ్రప్రదేశ్, గోదావరిల గొప్పదనం ప్రపంచానికి చాటినట్లవుతుంది.... అంతేకాదు... భారీ స్థాయిలో జరగబోతున్న ఈ గొప్ప వేడుక స్థాయి... ప్రాముఖ్యత అందరికీ తెలుస్తుంది.