Begin typing your search above and press return to search.

దేవుడికి తానెంత స్పెషల్ పీస్ నో చెప్పిన ఎంపీ

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:16 AM GMT
దేవుడికి తానెంత స్పెషల్ పీస్ నో చెప్పిన ఎంపీ
X
ఏదైనా చిన్న విషయం జరిగిన వెంటనే ఆగమాగం చేసే మేధావులు.. బుద్దజీవులు.. ప్రజాస్వామ్యవాదులు.. లౌకికవాదులు పేజీలకు పేజీలకు వ్యాసాలు రాసేస్తుంటారు. అలాంటి వారి రాతలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించటానికి మీడియాలోని ఒక వర్గం అదే పనిగా పని చేస్తుంటుంది. కాలం చెల్లిన విధానాలకు ప్రజల నుంచి స్పందన లేకున్నా.. తమకున్న పలుకుబడితో ప్రజల మీద ప్రభావం చూపేందుకు కిందా మీదా పడుతుంటారు. అలాంటి వారు.. మతమౌఢ్యంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే కొందరి విషయంలో మాత్రం మౌనంగా ఉంటారు. పెదవి విప్పటానికి ఏ మాత్రం మక్కువ చూపరు.

ముస్లిం అయిన ఒక మహిళా ఎంపీ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడకూడదా? పెళ్లాడిన తర్వాత.. తన భర్త పాటించే హిందూమతానికి సంబంధించిన పూజలు చేయకూడదు? పూజలు చేసినంతనే మతం మారిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చేస్తున్న మత పెద్దల విషయంలో మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. మరి.. హిందుమహిళలు పలువురు చర్చిలకు వెళ్లి వస్తుంటారు. దర్గాలకు వెళ్లి పూజలు చేస్తూ.. మొక్కులు చెల్లించుకుంటూ వస్తారు.

మరి.. ఇలాంటి వారందరిని మతం మారాలని ఎవరైనా చెబితే.. అలాంటి వారిని వెంటాడి.. వేధించే మేధావులు.. ముస్లిం మతాధికారుల్లో కొందరు చేసే అతి వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించరు? మరెందుకు తప్పు పట్టరు? అన్నది క్వశ్చన్ గా మారింది. పశ్చిమబెంగాల్ కు చెందిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ ముస్లిం అన్న సంగతి తెలిసిందే. హిందువైన తన స్నేహితుడితో ఆమె ప్రేమ వివాహం జరిగింది.

తాజాగా జరిగిన దసరా వేడుకల్లో నుదుట సింధూరం పెట్టుకొని సింధూర్ ఖేలా కార్యక్రమంలో భర్త నిఖిల్ జైన్ తో కలిసి పాల్గొన్నారు. దుర్గాపూజలో పాల్గొన్న నుస్రత్ ను ఇస్లాం మతాధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెను మతం మారాలంటూ హెచ్చరికలు చేశారు. ఈ వ్యవహారం కలకలాన్ని రేపింది.

ఒక మహిళ తనకు నచ్చిన రీతిలో ఉండే స్వేచ్ఛ ఉన్నప్పుడు.. మధ్యలో మతాధికారులకు వచ్చిన ఇబ్బందేమిటన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. అదే సమయంలో.. మూఢత్వంతో మాట్లాడే సదరు మతాధికారి మాటలు సరికావంటూ ఏ ఒక్క వామపక్ష మేధావి స్పందించకపోవటంపై పలువురు తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇలాంటి వ్యాఖ్యల్ని తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేస్తోంది నుస్రత్ జహాన్. తాను భగవంతుడి ప్రత్యేక పుత్రికను.. అన్ని పండగలనూ జరుపుకుంటానని చెప్పిన ఆమె.. తాను మానవత్వాన్ని.. ప్రేమను ఎక్కువగా గౌరవిస్తానంటూ తనను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్న వారికి తనదైన శైలిలో చురకలు వేసింది. తాను స్పెషల్ పీస్ అన్న విషయాన్ని చేతలతో ఇప్పటికే చెప్పేసిన నుస్రత్.. మాటలతో మరింత బాగా అర్థమయ్యేలా చెబుతున్నారని చెప్పక తప్పదు.