Begin typing your search above and press return to search.

ఇక అక్కడ కూడా ఫాస్ట్‌ గా వెళ్లొచ్చు .... !

By:  Tupaki Desk   |   13 Nov 2019 11:41 AM GMT
ఇక అక్కడ కూడా ఫాస్ట్‌ గా వెళ్లొచ్చు .... !
X
రహదారుల పై టోల్‌ ప్లాజాల దగ్గర బారులు తీరిన వాహనాలు ఇక కనిపించవు. వాహనదారులు రుసుము చెల్లించడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. టాక్స్ లు చల్లించుకుంటూ వెళ్లాల్సిన పని లేదు. అదేంటి రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తున్నారా అని ఆలోచిస్తున్నారా .. అదేం కాదు కానీ, టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ ని అరి కట్టడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానం తో కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. టోల్‌గేట్ల వద్ద గంటల కొద్దీ పడి గాపులు కాసే విధానానికి స్వస్తి పలికే లా ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు ఒకటవ తేదీ నాటికి ఈ సదుపాయం అందుబాటు లోకి రానున్నది.

జాతీయ రహదారి పై టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ రద్దీ సమయంలో రుసుం చెల్లింపునకు వాహనాలు బారులు తీరాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు టోల్‌ ప్లాజా దాటడానికి కనిష్ఠంగా పది నిమిషాలు, గరిష్ఠంగా అర్ధ గంటకు పైగా సమయం పడుతున్నది. నగదు రూపంలో రుసుం చెల్లిస్తుండడం, వాహనదారుల వద్ద తగిన చిల్లర లేక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దీనిని అధిగమించి, టోల్‌ ప్లాజాల వద్ద ఆన్‌లైన్‌ లో రుసుం చెల్లింపులు జరిగేలా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని కొన్ని టోల్‌ ప్లాజాల వద్ద ఇప్పటికే ఇటువంటి ఏర్పాట్లు చేశారు. మిగిలిన టోల్‌ప్లాజాల వద్ద కూడా డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ లో రుసుం చెల్లింపులు జరిగేలా ‘ఫాస్టాగ్‌’ విధానాన్ని అమలులోకి తీసుకు రావాలని కేంద్రం నిర్ణయించింది.

ఫాస్టాగ్‌ అమలు తో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వేచి వుండాల్సిన పనిలేదు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు 'మై ఫాస్టాగ్‌, ఫాస్టాగ్‌ పార్టనర్‌’ మొబైల్‌ యాప్‌ను ఇప్పటి కే అందుబాటు లోకి తీసుకువచ్చారు. వాహన దారులు తమ బ్యాంకు ఖాతా తో ఈ యాప్‌ను అను సంధానం చేసుకుని, నిర్ణీత సొమ్మును ఎంపిక చేసిన బ్యాంకులు, టోల్‌ ప్లాజాల్లో చెల్లిస్తే ఫాస్టాగ్‌ పేరుతోపాటు బార్‌ కోడ్‌తో కూడిన ఒక ప్రీపెయిడ్‌ స్టిక్కర్‌ ఇస్తారు. దీనిని వాహనం ముందు భాగంలో అద్దంపై అతికించాలి. ఈ స్టిక్కర్‌ వున్న వాహనాల కోసం టోల్‌ ప్లాజా వద్ద ప్రత్యేకంగా మార్గాలను కేటాయిస్తారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ గేటుకు సుమారు 50 మీటర్ల దూరం లో టోల్‌ ప్లాజాకు చెందిన సిబ్బంది ఉంటారు.

ఫాస్టాగ్‌ వున్న వాహనాలను మాత్రమే ఈ మార్గాల్లోకి అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్‌ గేటుపైన, కింద సీసీ కెమెరాలు ఉంటాయి. వాహనం గేటు వద్దకు వచ్చే లోగా దానికి వున్న ఫాస్టాగ్‌ బార్‌ కోడ్‌ ను ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ కెమెరాలు స్కాన్‌ చేస్తాయి. దీంతో గేటు ఆటోమేటిక్‌ గా తెరుచుకుంటుంది. వాహనం ఆగకుండా వెళ్లి పోవచ్చు. ఈ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని, చిల్లర సమస్య వుండదని టోల్‌ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. ఫాస్టాగ్‌ లేని వాహనాలు మిగిలిన గేట్ల వద్ద నిర్ణీత ఫీజు చెల్లించి రాక పోకలు సాగించవచ్చునని తెలిపారు.