Begin typing your search above and press return to search.

రేపు స్వ‌రాష్ట్రానికి మూర్తి భౌతిక‌కాయం!

By:  Tupaki Desk   |   3 Oct 2018 8:09 AM GMT
రేపు స్వ‌రాష్ట్రానికి మూర్తి భౌతిక‌కాయం!
X
అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం గీతం మూర్తిని బ‌లి తీసుకోవ‌డం తెలుగువారిని తీవ్రంగా క‌ల‌చివేస్తోంది. విద్యావేత్త‌గా - రాజ‌కీయ నాయ‌కుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న ఆయ‌న ఇక లేర‌నే విష‌యాన్ని ప‌లువురు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌హా ప‌లువురు తెలుగుదేశం పార్టీ నేత‌లు - వివిధ రంగాల‌ ప్ర‌ముఖులు మూర్తి మృతికి సంతాపం తెలియ‌జేశారు.

గీతం యూనివ‌ర్సిటీ స్థాప‌న‌తో విద్యాదాత‌గా మూర్తి పేరు తెచ్చుకున్నారు. నిరంత‌రం ఆయ‌న విద్యార్థుల శ్రేయ‌స్సు కోసం ప‌రిత‌పించేవారు. చివ‌ర‌కు అదే విద్యార్థుల కోసం వెళ్లి క‌న్నుమూశారు. కాలిఫోర్నియాలో ఈ నెల 6న జ‌ర‌గ‌నున్న గీతం పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నంలో పాల్గొనేందుకే ఆయ‌న అమెరికా వెళ్లారు. ఆ స‌మ్మేళ‌నానికి ఇంకా మూడు రోజులు స‌మ‌యం ఉండ‌టంతో.. స‌ర‌దాగా అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు మిత్రుల‌తో క‌లిసి బ‌య‌లుదేరారు. ఇంత‌లోనే ట్ర‌క్కు రూపంలో వ‌చ్చిన‌ మృత్యువు ఆయ‌న్ను క‌బ‌ళించింది. రోడ్డు ప్ర‌మాదంలో మూర్తితోపాటు వెలువోలు బసవపున్నయ్య - వీరమాచినేని శివప్రసాద్ - వి.బి.ఆర్‌ చౌదరి దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. అదే కారులో ప్ర‌యాణిస్తున్న కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు.

మూర్తి స‌హా మ‌రో ముగ్గురి మృత‌దేహాల‌ను అమెరికా అధికారులు ప్ర‌స్తుతం అలస్కా స్టేట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌లో ఉంచారు. ఇప్ప‌టికే ఓ మృత‌దేహానికి పోస్ట్‌ మార్టం పూర్తి చేశారు. మ‌రో మూడు మృత‌దేహాలకు స్థానిక కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం ఉద‌యం పోస్ట్ మార్టం పూర్తి చేయ‌నున్నారు. ప్ర‌మాదం వార్త తెలిసిన వెంట‌నే అమెరికాలోని తానా స‌భ్యులు వేగంగా స్పందించారు. తానా అధ్య‌క్షుడు వేమ‌న స‌తీశ్‌ - కార్యదర్శి అంజయ్యరావు - కోశాధికారి రవి పొట్లూరి - మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర - తానా టీం స్క్వేర్‌ బృందం... దర్యాప్తు అధికారి వాస్మన్‌ - డిటెక్టివ్‌ జారెడ్‌ ఫిషర్‌ తో ఉండి వారికి కావాల్సిన వివరాలు అందిస్తున్నారు. మ‌రోవైపు, ప్రమాదంలో గాయ‌ప‌డిన వెంకట్‌ కడియాలకు అలస్కాలోని రీజనల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న వెన్నెముక‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది.

గీతం మూర్తి భౌతికకాయాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స్వ‌రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యంలో రంగంలోకి దిగారు. అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న మాట్లాడుతున్నారు. బుధ‌వారం రాత్రికే మూర్తి భౌతిక‌కాయాన్ని అమెరికాలో ఆయ‌న బంధువుల‌కు అధికారులు అప్పగించే అవకాశం ఉంది. అనంత‌రం వీలైనంత త్వరగా భౌతికకాయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తామని ఏపీ భవన్‌ కమిషనర్‌ శ్రీకాంత్ వెల్ల‌డించారు. ఋధ‌వారం సాయంత్రంలోపు పోస్ట్‌ మార్టం పూర్త‌యితే.. గురువారం రాత్రిక‌ల్లా భౌతిక‌కాయాన్ని స్వ‌రాష్ట్రానికి తీసుకురావొచ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు.