Begin typing your search above and press return to search.

వైకాపా ఎమ్మెల్యే కు బెయిల్‌

By:  Tupaki Desk   |   18 Dec 2015 11:45 AM GMT
వైకాపా ఎమ్మెల్యే కు బెయిల్‌
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌ల న‌రుకుతాన‌న్న పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రికి హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వ‌కాల‌ను నిర‌సిస్తూ గ‌త గురువారం చింతపల్లి ఆర్టీసీ మైదానంలో వైకాపా ఓ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న ప్రతిపక్ష నేత వైఎస్‌.జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే గిడ్డి ఈశ్వ‌రి చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో సీఎం చంద్రబాబు నాయుడు తల తెగ నరుకుతామని ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. చంద్రబాబును నరరూప రాక్షసుడిగానే కాక వెన్నుపోటుదారుడు, దగాకోరుగా ఆమె అభివర్ణించారు.

ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో రాష్ర్ట వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి, పాడేరు, అరకు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో 124(ఎ) 307, 506, 511 సెక్షన్‌ల కింద కేసు నమోదు అయ్యింది. పోలీసులు ఆమెను ముంద‌స్తుగా అరెస్టు చేయ‌డానికి రంగం సిద్ధం చేయ‌డంతో ఆమె అప్పుడే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆమె కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ముంద‌స్తుగా బెయిల్ ల‌భించింది. త‌న‌కు బెయిల్ రావ‌డంతో రేప‌టి నుంచి అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతున్న‌ట్టు ఎమ్మెల్యే ఈశ్వ‌రి తెలిపారు.